గంటాకు బ్యాంకు షాక్ ఇచ్చినట్లేనా ?

ఉత్తరాంధ్రలో సీనియర్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యంకు పెద్ద షాకే ఇచ్చింది. ఎందుకంటే గంటా కీలకంగా వ్యవహరించిన చాలా సంస్ధలకు చెందిన ఆస్తులను వేలం వేయబోతున్నట్లు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈనెల 23వ తేదీ వరకు ఈ- వేలం పాటలో పాల్గొనే వాళ్ళు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. 25వ తేదీన టెండర్లను బ్యాంకు ఓపెన్ చేస్తుంది. ప్రత్యూషా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ ఇప్పటికే బ్యాంకు అటాచ్ చేసేసింది.

ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా, ప్రత్యూషా గ్లోబల్ ట్రేడ్, ప్రత్యూషా ఎస్టేట్స్ లాంటివన్నీ ప్రత్యూషా గ్రూపులో అంతర్భాగాలు. ఈ గ్రూపు ఇండియన్ బ్యాంకులో అప్పుడెప్పుడో సుమారు రూ. 150 కోట్ల రుణం తీసుకుంది. అయితే తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టింది. దాంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి ఇపుడు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 250 కోట్లకు చేరిందట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై కంపెనీలో గంటా శ్రీనివాసరావు ఒకపుడు చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే బ్యాంకులో గ్రూపు అప్పు తీసుకున్నపుడు గంటా కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. అయితే ఆ కంపెనీతో తనకేమీ సంబంధం లేదని ఇపుడు గంటా చెబుతున్నారు. అప్పులతో కానీ వేలంపాటతో కానీ తనకు సంబంధం లేదని గంటా చెబుతున్నా వేలం వేయబోయే ఆస్తుల్లో గంటా సొంతాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.

విశాఖలోని ఖరీదైన ప్రాంతంలోని ఆస్తులతో పాటు రుషికొండ, భీమిలీ, మధురవాడ, గాజువాక, ఆనందపురంలో ఉన్న ఆస్తులు వేలం వేయబోతున్నట్లు బ్యాంకు వేలం నోటిసులో చెప్పింది. మరి వేలం వేసిన తర్వాతే ఎవరెవరి ఆస్తులున్నాయో ? అప్పు ఎగొట్టడంలో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది తేలుతుంది. అంతవరకు వెయిట్ చేయాల్సిందే.