లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కొమ్మినేని

సాక్షి టీవీ ఛానెల్లో వచ్చే ‘కేఎస్ఆర్ లైవ్ షో’ ఇటీవల ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే మరో సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి అది ‘వేశ్యల రాజధాని’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దానికి కొమ్మినేని నవ్వడం.. తీవ్ర దుమారమే రేపింది. ఇటు కొమ్మినేనిపై, అటు కృష్ణంరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.

ఐతే నేరుగా కొమ్మినేని ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో సుప్రీం కోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. ఐతే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మూడు రోజుల్లోనే సాక్షి టీవీలో ప్రత్యక్షం అయిపోయారు కొమ్మినేని. తన షోలో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మీద కేసులుపెట్టి అరెస్ట్ చేయడం పట్ల ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక దశలో నోటి నుంచి మాట రాలేదు.

తాను 40 ఏళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నానని.. కానీ ఎప్పుడూ హద్దులు దాటి మాట్లాడింది, ప్రవర్తించింది లేదని కొమ్మినేని అన్నారు. చంద్రబాబుది, తనదీ దాదాపు ఒకే వయసని.. ఆయన్ని తాను ఎంతో గౌరవిస్తానని.. తన షోల్లో ఎవరైనా చంద్రబాబు పేరు పెట్టి మాట్లాడినా గారు అని సంబోధించాలని అంటారని.. అలాంటి తన మీద ఇలా కక్ష గట్టి కేసులుపెట్టడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అనని మాటలకు తనను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. తాను కేసులకు భయపడేవాడిని కాదని.. కానీ తన మీద ఈ వయసులో ఇలాంటి మచ్చ పడడం, చేయని తప్పుకి జైలుకు వెళ్లాల్సి రావడం మాత్రం భరించలేని బాధను కలిగించిందని ఆయన చెప్పారు. తన ఊపిరి తీయాలని కొందరు ప్రయత్నిస్తే.. ఊపిరి పోయాలని జగన్, భారతి ప్రయత్నించారని.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కొమ్మినేని పేర్కొన్నారు. తాను లేనపుడు కూడా తన షోను యధావిధిగా కొనసాగించినందుకు కృతజ్ఞుడినని చెప్పారు.