‘ఫోన్ ట్యాపింగ్’ బాధితులు 600 మంది.. భారీ కుట్ర‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు 2023లో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై వ‌చ్చిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌.. ఫోన్ ట్యాపింగ్‌. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ స‌హా.. అధికార ప‌క్షంలోని కొంద‌రు రెబ‌ల్ నాయ‌కుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే కేసు న‌మోదై.. దాదాపు ఏడాది అవుతోంది. గ‌త ఏడాదిలో మొద‌లైన ఈ కేసు విచార‌ణ ఇప్ప‌టికీ సాగుతోంది. అయితే.. కేసు విచార‌ణ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని అంటున్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగు చూసిన విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 600 మంది ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు అధికారులు గుర్తించారు.

అయితే.. తొలుత రాజ‌కీయాల‌కు చెందిన వారి ఫోన్ల‌నే ట్యాప్ చేసిన‌ట్టు అంద‌రూ భావించారు. కానీ, సినీ రంగానికి చెందిన వారి పోన్ల‌ను కూడా ట్యాప్ చేశారు.అ దేవిధంగా కీల‌క‌మైన జ‌ర్న‌లిస్టుల పోన్ల‌ను కూడా ట్యాపింగ్ చేశారు. ఎవ‌రు ఎవ‌రితో మాట్లాడుతున్నారు. బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు క‌థ న‌డిపిస్తున్నారు? ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? ఇలా అనేక అంశాల‌పై అప్ప‌ట్లో ట్యాపింగ్ చేశార‌ని తాజాగా వెలుగు చూసింది. ఇలా మొత్తంగా 600 మంది పోన్ల‌ను ట్యాప్ చేసి విన్నార‌ని ప్ర‌స్తుత ద‌ర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది. అంతేకాదు.. ఇలా ట్యాప్ చేసి.. న‌గ‌దు త‌ర‌లిస్తున్న వారిని బెదిరించి.. వారి నుంచి స్వాధీనం చేసుకున్న‌ట్టుగా కూడా తెలిపింది.

ఎలా గుర్తించారు..?

ప్ర‌స్తుతం ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న అధికారులు ఆయా విష‌యాల‌నుఎలా రాబ‌ట్టార‌నేది కీల‌కం. కీల‌క నిందితుడు.. ఏ1గా ఉన్న ఐపీఎస్ ప్ర‌భాక‌ర్‌రావు ఇచ్చిన వాంగ్మూలంతోపాటు.. ఇప్ప‌టికే విచారించిన న‌లుగురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ఒక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అప్ప‌ట్లో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ప్పుడు ఉద‌యాన్నే ప్ర‌భాక‌ర్ రావు లైన్‌లోకి వ‌చ్చేవార‌ని.. ఆ రోజు ఎవ‌రిని ట్యాప్ చేయాలి? ఎలాంటి స‌మాచారం రాబ‌ట్టాల‌నే విష‌యంపై ఇత‌రుల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశార‌ని తెలిసింది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్‌ రెడ్డిల ఫోన్‌లు ట్యాప్ చేసి సొమ్ములు సైతం స్వాధీనం చేసుకున్నార‌ని అధికారులు గుర్తించారు.

అంతేకాదు.. పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నార‌ని కూడా ద‌ర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. ఇక‌, బీఆర్ ఎస్‌పై వ్య‌తిరేక జెండా ఎగ‌రేసిన నాయ‌కుల పోన్ల‌ను కూడా ట్యాప్ చేశారు. వారు ఏయే పార్టీల్లో చేరుతున్నారు. ఎక్క‌డెక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యాల‌ను కూడా ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. మొత్తంగా ట్యాపింగ్ విష‌యంలో అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.