లబ్దిదారుల క్షేమం గురించి ప్రభుత్వానికి పట్టదా ?

ప్రభుత్వానికి మంకుపట్టు ఉండుకూడదు. అధికారంలో ఉన్నాం కాబట్టి తాము ఏమి చేసినా చెల్లుబాటైపోతుందని అనుకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం అమలు చేయాలని అనుకున్న సంక్షేమ పథకాల్లో లోపాలున్నాయని ప్రతిపక్షాలు చెప్పినపుడు వాస్తవాలు ఏమిటో ఆలోచించాలి. అంతేకానీ ప్రతిపక్షాలు చెప్పినట్లుగా ఎందుకు చేయాలనే మంకుపట్టు ఉండకూడదు. అలా కాదని మొండిగా తాను అనుకున్నదే చేసుకుపోతానంటే అంతిమంగా నష్టపోయేది లబ్దిదారులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే ప్రభుత్వం వేలాది ఇళ్ళ స్ధలాలు పంపిణి చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెద్దఎత్తున స్ధలాలు సేకరించింది. ఇంటి పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం 23,377 ఎకరాలను సేకరించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారుగా రూ 7 వేల కోట్లు ఖర్చు పెట్టింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 5548 ఎకరాలను రూ. 1628 కోట్లతో సేకరించింది. చాలా చోట్ల ప్రైవేటు భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి మరీ ప్లాట్లు వేసింది.

అయితే ఇక్కడే సమస్య మొదలైంది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన ప్రాంతాల్లో భూమి నివాసయోగ్యం కావంటు ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ వర్షాలకు నీరు నిల్వుండే ప్రాంతాలు కాబట్టి అక్కడ ఇళ్ళు కట్టినా లబ్దిదారులు ఇబ్బందులు పడతారంటు నెత్తీ నోరు మొత్తుకుంటున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాల్లో ఇళ్ళ నిర్మాణాలు చేసినా లబ్దిదారులు ఉండలేరని చంద్రబాబునాయుడు, సోమువీర్రాజుతో పాటు ఇతర నేతలు గట్టిగా చెబుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుపాన్ల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వర్షాలు, తుపాను ప్రభావం తగ్గగానే చాలా చోట్ల నీరింకిపోయింది. కానీ కొన్నిచోట్ల మాత్రం ప్రభుత్వం సేకరించిన భూముల్లో నీరు ఇంకా నిల్వ ఉందట. కాకినాడ దగ్గర ఆవభూములే ఇందుకు నిదర్శనంగా ప్రతిపక్షాలు చూపుతున్నాయి. ప్రైవేటు భూములు సేకరించేటపుడు అధికారపార్టీ నేతలు భారీగా లబ్దిపొందారనే ఆరోపణలను కూడా టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నిజానికి ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరపించాలి. కనీసం వాళ్ళ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకపోతే ఎలా ? నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్ళ స్ధలాలు ఇచ్చికూడా ఉపయోగం లేనపుడు ఇక ఇవ్వటం ఎందుకు ? భారీ వర్షాలు తగ్గి రోజులు గడుస్తున్నా ఇంకా కొన్నొచోట్ల నీరు అలాగే నిల్వ ఉండిపోయిందంటే అవి ఎప్పటికీ నివాసయోగ్యం కావని అర్ధమైపోతోంది. కాబట్టి మంకు పట్టుకుపోకుండా ప్రతిపక్షాలు చెబుతున్న మాటలను కాస్త ప్రభుత్వం వింటేనే వేల కోట్ల రూపాయల ఖర్చుకు సార్దకత వస్తుంది. లేకపోతే అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమని నిర్ధారణయినట్లే అనుకోవల్సుంటుంది.