సాక్షిలో కొత్తగా ‘డిస్క్లైమర్’

సాక్షి టీవీలో ఇటీవల జరిగిన ఒక చర్చా కార్యక్రమం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే మరో సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అమరావతిని దేవతల రాజధాని అనడం తప్పు అంటూ.. అది వేశ్యల రాజధాని అని పేర్కొనడం తీవ్ర దుమారమే రేపింది. ఇటు కొమ్మినేనిపై, అటు కృష్ణంరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.

కొమ్మినేని నేరుగా ఏ కామెంట్ చేయకపోవడంతో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. కృష్ణంరాజు మాత్రం రిమాండులోనే ఉన్నారు. కృష్ణంరాజు వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. దాంతో తమ ఛానెల్‌కు సంబంధం లేదని సాక్షి వివరణ ఇచ్చినా.. ఆ ఛానెల్ మీద, వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత తప్పలేదు. ఈ వ్యవహారం సాక్షికి, వైసీపీకి బాగా చెడ్డపేరు తెచ్చిపెట్టిన నేపథ్యంలో సాక్షి మీడియా జాగ్రత్త పడింది. ఎన్నడూ లేని విధంగా తమ ఛానెల్లో జరిగే చర్చా కార్యక్రమాల ముంగిట ఆ ఛానెల్ డిస్క్లైమర్ వేస్తోంది.

ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అతిథుల వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని.. దాంతో తమ ఛానెల్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించడం కానీ, ప్రచారం చేయడం కానీ చేయమని.. ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తాము అందుకు బాధ్యులు కామని.. వాటిని తీవ్రంగా ఖండిస్తామని సాక్షి స్పష్టం చేసింది. తమ ఛానెల్‌కు విలువలు, నిబంధనలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని సాక్షి పేర్కొంది.

బహుశా తెలుగు టీవీ ఛానెళ్లలో చర్చా కార్యక్రమాల ఆరంభానికి ముందు ఇలా డిస్క్లైమర్లు వేయడం ఇదే తొలిసారి కావచ్చు. ఇటీవల పరిణామాలు సాక్షి మీడియాకు ఎంత ఇబ్బంది కలిగించాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ. బెయిల్ మీద రిలీజైన కొమ్మినేని కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఛానెల్లోకి వస్తారని సమాచారం. కానీ ఇకపై ఆయనతో పాటు సాక్షిలో చర్చా కార్యక్రమాలు నిర్వహించే న్యూస్ ప్రెజెంటర్లందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు.