ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తోంది. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పలు సంస్థ లకు రాష్ట్రంలో భూములు కూడా కేటాయిస్తోంది. ఇలానే గుంటూరు జిల్లాలో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాజధాని పరిధిలోనే ఉంటుందని గతంలో చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన పెట్టుబడులు కూడా సమీకరిస్తున్నారు.
ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని.. ఇటీవల మహానాడులోనూ సీఎం చంద్రబాబు ప్రకటన జారీ చేశారు. ఐటీ పార్కు రాకతో బెంగళూరును మించిన ఐటీ వ్యాపారం ఏపీకి సొంత మవుతుందని కూడా సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులో 233 ఎకరాల భూములను ఐటీ పార్కుకు కేటాయిస్తూ.. ఇటీవల కేబినెట్ కూడా తీర్మానం చేసింది. వీటిలో 100 ఎకరాలు ఒకే చోట ఉండగా.. మరో 100 వేరే చోట ఉన్నాయి.
అయితే.. మొత్తంగా అమరావతి రాజధాని పరిధిలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పుడు ఈ భూముల కేటాయింపే పెను వివాదంగా మారింది. ఐటీ పార్కు కోసం కేటాయిస్తున్న భూములు తమవంటూ.. ముస్లిం సంఘాలుగళం వినిపిస్తున్నాయి. తాజాగా సోమవారం గుంటూరు కలెక్టర్ చేపట్టిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మైనారిటీ ముస్లింలు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేశారు. ఐటీ పార్కు కోసం కేటాయించేందుకు సిద్ధం చేసిన భూములు ఇవ్వడానికి వీల్లేదన్నారు.
“ఆ భూములన్నీ మా వక్ఫ్ భూములు. వాటిని ఎట్టి పరిస్థితిలోనూ కేటాయించేందుకు వీల్లేదు.” అని ముస్లిం నాయకులు తేల్చి చెప్పారు. కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలోనూ ఇదే విషయాన్ని స్పస్టం చేశారు. చిన్న కాకాని, మల్లాయపాలెంలలో ఐటీ పార్కుకు కేటాయించిన భూములు ముస్లింల ధార్మిక సంస్థకు చెందిన భూములని వారు వెల్లడించారు. తమ భూముల జోలికి రావద్దని కూడా వారు తెగేసి చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates