ముద్దుకృష్ణమ కుటుంబానికి క‌లిసిరాని రాజ‌కీయం.. ఏం చేస్తున్నారంటే!

గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, చివ‌రి ద‌శ‌లో ఎమ్మెల్సీగా ప‌నిచేసిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మృతి చెందారు. దీంతో ఆయ‌న కుటుంబానికి చంద్ర‌బాబు నాయుడు ప్రాధాన్యం పెంచారు. అయితే, కుటుంబం అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో క‌కావిక‌లం కావ‌డం, ముద్దు కుమారుల్లో ఒక‌రు వైసీపీకి లోపాయికారీ మ‌ద్ద‌తుదారుగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి వారి రాజ‌కీయ భ‌వితవ్యాన్ని ప్ర‌శ్నార్థ‌కం చేశాయి. ముద్దు కృష్ణ జీవించి ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న త‌న వారసుడిగా.. పెద్ద కుమారుడు భాను ప్ర‌కాశ్‌రెడ్డిని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. దీంతో ఆయ‌న త‌న తండ్రితో క‌లిసి చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో అనేక ప‌ర్యాయాలు ప‌ర్య‌టించారు.

ఇంత‌లో ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉంద‌న‌గానే ముద్దు కృష్ణ‌మ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అప్ప‌టికి చంద్ర‌బాబు స‌ర్కారు ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని కుటుంబానికే కేటాయించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, మాకంటే మాకు ఈ ప‌ద‌వి ఇవ్వాలంటూ.. ఇద్ద‌రు కుమారులు, త‌ల్లి కూడా వీధి కెక్కారు. ఇది ఒక‌విధంగా చంద్ర‌బాబుకు చికాకు క‌లిగించినా.. ముద్దుకృష్ణమ .. పార్టీకి చేసిన సేవల నేప‌థ్యంలో చంద్ర‌బాబు కొంత సంయ‌మ‌నం పాటించి.. ముద్దు స‌తీమ‌ణి స‌రస్వ‌త‌మ్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. పెద్ద కుమారుడుకి గ‌త ఎన్నిక‌ల్లో న‌గరి టికెట్ ఇచ్చారు. వాస్త‌వానికి గెలిచే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ… ఇక్క‌డ కూడా కుటుంబంలోని అంత‌ర్గ‌త పోరుతో … వైసీపీకి ప్ల‌స్ అయింది.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో న‌గ‌రి ఎమ్మెల్యే టికెట్‌ను భాను ప్ర‌కాశ్‌కు ఇవ్వ‌డాన్ని సొంత సోద‌రుడు వ్య‌తిరేకించారు. త‌న‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ఈ పంచాయ‌తీ తేలేలోపే.. నామినేష‌న్‌కు గ‌డువు వ‌చ్చేయ‌డం.. చివ‌రికి చంద్ర‌బాబు మ‌రోసారి జోక్యం చేసు కుని.. స‌ర్దిచెప్ప‌డం తెలిసిందే. ఈ ప‌రిణామాల‌ను వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. త‌న‌కు అవ‌కాశంగా మార్చుకున్నారు. ప్ర‌చారంలో ఈ కుటుంబంలోని అంత‌ర్గ‌త విష‌యాల‌ను కూడా ఆమె ప్ర‌స్తావించారు. ఫ‌లితంగా ముద్దుకృష్ణ‌మ మ‌ర‌ణంతో ఈ కుటుంబంపై సానుకూల సానుభూతి ప‌వ‌నాలు వీస్తాయ‌ని.. గెలుపు ఏక‌ప‌క్షం అవుతుంద‌ని ఆశించిన వారికి ఆశాభంగ‌మే అయింది.

ఇక‌, ఎన్నిక‌లు ముగిసి ఏడాదిన్న‌ర అయింది. ఈ క్ర‌మంలో టీడీపీలో రాష్ట్ర క‌మిటీ, పొలిట్ బ్యూరో, జాతీయ క‌మిటీ వంటివి ఏర్పాటు చేశారు. వీటిలో అనేక మందికి ప‌ద‌వులు ఇచ్చారు. కానీ, గాలి ఫ్యామిలీకి మాత్రం చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పి.రాజా అనే టీడీపీ నేత‌కు రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా అవ‌కాశం క‌ల్పించారు త‌ప్ప‌.. గాలి కుటుంబాన్ని మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణాలు.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఇప్ప‌టికీ.. ఈ కుటుంబం అట్టుడుకుతుండ‌డం, గాలి చిన్న కుమారుడు వ్యాపారాల రీత్యా వైసీపీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ముందుకు సాగుతుండ‌డం, నియోక‌వ‌ర్గంలో భాను ప్ర‌కాశ్ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోవ‌డం వంటివి చంద్ర‌బాబుకు ఇబ్బందిక‌రంగా మారాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

ఈ ప‌రిణామాల‌తో ఇక‌, గాలి ముద్దుకృష్ణ‌మ కుటుంబం రాజ‌కీయాలు ఇక ముగిసిన‌ట్టేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నా యి. ఎంతో ఫ్యూచర్ ఉన్నప్ప‌టికీ.. సానుకూల దృక్ఫ‌థం, ఐక్య‌త లేని కార‌ణంగా.. త‌మ భ‌విష్య‌త్తుతో పాటు.. ముద్దుకృష్ణ‌మ సాధించిన రాజ‌కీయ ప‌లుకుబ‌డిని కూడా వీరు నాశ‌నం చేస్తున్నార‌నే ఆవేద‌న సీనియ‌ర్ల‌లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.