భూమా ఫ్యామిలి జిల్లాలో ఒంటరైపోయిందా ?

బండ్లు ఓడలు..ఓడలు బండ్లు అయిపోవటమంటే భూమా ఫ్యామిలిని చూస్తే అర్ధమైపోతుంది. ఒకపుడు కర్నూలు జిల్లాను దశాబ్దాల పాటు ఏలిన భూమి ఫ్యామిలి ఇపుడు రాజకీయంగా నిలదొక్కుకోవటానికి నానా అవస్తలు పడుతోంది. ఏడాది వ్యవధిలో భూమా శోభానాగిరెడ్డి, నాగిరెడ్డి దంపతులు మరణించటంతో వారసులు రాజకీయంగా నిలదొక్కుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గడచిన ఏడాదిన్నరగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం చూస్తుంటే అందరికీ అవుననే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే నంద్యాల, ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో భూమా ఫ్యామిలి చెప్పిందే వేదం. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే అధినేతలు కూడా వాళ్ళు చెప్పిన మాటకే విలువిచ్చేవారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో భూమా ఎంత చెబితే అంతే. ఫ్యాక్షనిజంను బ్యాక్ డ్రాపుగా పెట్టి సినిమాలు వచ్చాయంటే అందుకు భూమా నాగిరెడ్డి నడిపిన ఫ్యాక్షన్ రాజకీయాలే స్పూర్తిగా చాలామంది చెప్పుకోవటం అందరికీ తెలిసిందే.

ఇలాంటి నేపధ్యం ఉన్న నాగిరెడ్డి, అంతకుముందు ఆయన భార్య శోభా నాగిరెడ్డి ఏడాది వ్యవధిలోనే మరణించారు. దాంతో తల్లి వారుసురాలిగా ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యింది. వైసీపీ తరపున ఎంఎల్ఏలుగా గెలిచిన తండ్రి నాగిరెడ్డితో పాటు అఖిల కూడా పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. తర్వాత జరిగిన పరిణామాల్లో నాగిరెడ్డి హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో సెంటిమెంటు ఓట్ల కోసం భూమా అఖిలప్రియకు చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో చోటిచ్చారు.

నాగిరెడ్డి బతికున్నంత వరకు వాళ్ళ వ్యవహారాలన్నింటినీ చూసుకున్న ఏవి సుబ్బారెడ్డితో అఖిలకు వివాదాలు మొదలయ్యాయి. దాంతో ఆళ్ళగడ్డలో మొదటి ప్రత్యర్ధిగా ఏవినే తయారయ్యారు. అప్పటికే భూమా ఫ్యామిలి అంటే జిల్లాలోని చాలామంది నేతలకు పడదు. జిల్లాలోని సీనియర్ నేతలు కేఇ కృష్ణమూర్తి, ఎన్ఎండి ఫరూఖ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు లాంటి చాలామంది భూమా కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఎప్పుడైతే భూమా దంపతులిద్దరు మరణించారో వెంటనే ప్రత్యర్ధులందరు ఏకమయ్యారు.

దానికితోడు అఖిల ప్రియ వ్యవహార శైలితో భూమా కుటుంబాన్ని అంటిపెట్టుకునున్న చాలామంది దూరమైపోయారు. ఈ నేపధ్యంలోనే జరిగిన ఎన్నికల్లో పార్టీతో పాటు భూమా కుటుంబం కూడా రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయింది. అప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయి. భూమా కుటుంబానికి రాజకీయంగా మద్దతు ఇవ్వటానికి ఏ సీనియర్ నేత కూడా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే మంత్రిగా ఉన్నపుడు అఖిల అందరితోను గొడవలు పెట్టుకున్నదట. అందుకనే ఇపుడు వైసీపీ నేతలతో భూమా కుటుంబానికి గొడవలు జరుగుతున్నా టీడీపీ పరంగా ఎవరు అండగా నిలవటం లేదనే టాక్ జిల్లాలో బాగా వినిపిస్తోంది. చూస్తుంటే భూమా కుటుంబం రాజకీయంగా ఏకాకైపోయినట్లే ఉంది.