పీఎస్సార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు

బాటీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేదింపులు, గ్రూప్- 1 మూల్యాంకనంలో అవకతవకల వ్యవహారాల్లో గత కొంత కాలం క్రితం అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులుకు బుధవారం స్వల్ప ఊరట లభించింది. అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు పీఎస్సార్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెరసి చాలా కాలం తర్వాత పీఎస్సార్ కు ఒకింత ఊరట లభించిందని చెప్పక తప్పదు.

జెత్వానీ కేసులో హైదరాబాద్ లో పీఎస్సార్ ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను విజయవాడ తరలించారు. కోర్టు ఆయనకు తొలుత రిమాండ్, కస్టడీకి పలుమార్లు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ సందర్భంగా బీపీలో హెచ్చుతగ్గులతో సతమతమైన పీఎస్సార్ పలుమార్లు జైలు నుంచే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ప్రస్తుతం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అదే సమయంలో తన ఆరోగ్య పరిస్థితి చూసి అయినా బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు… పీఎస్సార్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోగ్య నివేదికను సీల్డ్ కవర్ లో అందించాలంటూ బెజవాడ ప్రభుత్వ వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పీఎస్సార్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బుధవారం ఆయన మెడికల్ రిపోర్టులను కోర్టుకు అందజేశారు. ఈ రిపోర్టులను పరిశీలించిన కోర్టు పీఎస్సార్ నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నారని భావించిన 14 రోజుల వ్యవధితో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావడంతో పీఎస్సార్ ఫ్యామిలీలో ఒకింత ఊరడింత కనిపించింది. ప్రస్తుతం బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కోర్టు ఉత్తర్వులు అందగానే… హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ఆయన కుటుంబం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ చికిత్స ఎంతకాలం సాగుతుందన్న దానితో సంబంధం లేకుండా 14 రోజుల తర్వాత పీఎస్సార్ తిరిగి విజయవాడ జిల్లా జైలులో సరెండర్ కావాల్సి ఉంది.