చూసి నేర్చుకునే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాటి మరెవరూ లేరు. ఆయన ఎక్కడా చిన్న బుచ్చుకోరు కూడా. ఏ స్థాయిలో ఉన్నా.. ఆయన గత అనుభవాలను నెమరు వేసుకుంటారు. పొరుగు వ్యక్తులను కూడా చూసి.. ఎలా ఉండాలో .. ఎలా ఉండకూడదో నేర్చుకోవడంలోనూ ఆయన వెనుకంజ వేయరు. ముఖ్యంగా వైసీపీ హయాంను కళ్లారా చూసిన చంద్రబాబు.. ఎలా ఉండకూడదో నేర్చుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నాలుగు కీలక విషయాల్లో.. చంద్రబాబు నిర్ణయాలు ఆసక్తిగా మారాయి. 1) సలహాదారులు.. ఈ విషయంలో వైసీపీ అధినేతకు ఎదురైన అనుభవాలు.. ఇప్పుడు చంద్రబాబు పాఠాలుగా మారాయి. ఎవరిని బడితే వారిని సలహాదారులుగా తీసుకోవడం.. ఎవరు చెప్పింది ఏమిటో తెలుసుకోకుండానే.. నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయడం లేదు. ఎవరు ఏం చెప్పినా.. చంద్రబాబు సావధానంగా వింటున్నారు. తర్వాత.. ఏది ప్రజా హితమో అదే నిర్ణయం తీసుకుంటున్నారు.
2) నాయకుల దూకుడు.. నాయకుల దూకుడు విషయంలో చంద్రబాబు పక్కాగా అలెర్ట్ అవుతున్నారు. ఎవరినీ ఆయన వదిలి పెట్టడం లేదు. తేడా వస్తే.. వారిని పిలిచి చర్చిస్తున్నారు. ఎవరూ కట్టుతప్పకుండా.. వ్యవహరిస్తున్నారు. ఎంతటి వారినైనా.. కట్టు తప్పకుండా వ్యవహరిస్తున్నారు. చిన్న తేడా నుంచి పెద్ద తేడా వరకు పరిశీలిస్తున్నారు. క్లాసు ఇస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల కారణంగా.. నాయకుల దూకుడు కారణంగా పార్టీ నష్టపోయింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
3) ప్రజలకు చేరువగా.. గత వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి ప్రజలకు చేరువ కాలేకపోయారన్న వాదన బలంగా వినిపించింది. అదేవిధంగా ఆఫీసులో ఉన్నతోద్యోగి మాదిరిగా జగన్ వ్యవహరించారని పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తాను ప్రజలకు చేరువగా ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాదు.. రోజు రోజంతా అవసరమైతే.. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఇది మంచి పరిణామమనిప్రజల నుంచి కూడా కితాబు అందుతోంది.
4) చెట్లు నరికి వేత.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పర్యటనల సమయంలో చెట్లను ఘోరంగా నరికేసేవారు. కానీ.. ఇప్పుడు చంద్రబాబు పర్యటనల సమయంలో చెట్లను నరుకుతున్న ఘటనలు లేవు. ఇటీవల తూర్పుగోదావరి పర్యటనలో చెట్లు నరికిన ఘటన వెలుగు చూడడంతో సదరు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. పైగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా.. చంద్రబాబు గత పాఠాల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారనే చెప్పాలి.