జలవనరుల విషయంలో చాలా కాలంగా గా ఓ లబ్ధిదారుగా ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో అల్లాడుతోంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తోంది. పొగరుతో నదిలో పారేది రక్తం అంటూ చేసిన కామెంట్స్ కు ప్రతిఫలంగా కరువుతో అల్లాడే పరిస్థితి ఎదురైంది. సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించి, తన హక్కైన నీటిని నిలిపివేసిన భారత్ చర్యలతో పాకిస్థాన్ వ్యవసాయ రంగం ఘోరంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా మంగ్లా, తర్బేలా డ్యామ్లలో నీటి నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోయాయి.
ఇప్పటికే పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందు నుంచే రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్ ఐఆర్ఎస్ఏ తాజా నివేదిక ప్రకారం, మొత్తం ప్రవాహంలో 21 శాతం నీటి కొరత తలెత్తగా, రెండు ప్రధాన డ్యామ్లలో అది 50 శాతం వరకూ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వేసవి పంటల సాగు తీవ్రంగా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. చీనాబ్ నది ప్రవాహం అకస్మాత్తుగా తగ్గడాన్ని కూడా ప్రత్యేకంగా గమనించారు.
ఈ పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ న్యూయార్క్ వేదికగా జరిగిన హిమానీనదాల సదస్సులో స్పందించారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. కానీ భారత్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తజికిస్థాన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, “ఒప్పందాన్ని వాస్తవంగా ఉల్లంఘించినది పాకిస్థానే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ ఒప్పందానికి నైతికత లేకుండా చేసింది,” అని ఘాటుగా స్పందించారు.
వాస్తవానికి 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ తన వాటాలోని నదులన్నీ పాకిస్థాన్కు వదిలేసింది. కానీ ఇటీవల ఉగ్రదాడులు, పాక్ వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకొని, భారత ప్రభుత్వం పునఃసమీక్ష ప్రక్రియ ప్రారంభించింది. ఇది చారిత్రక దృష్టిలో ఒక పెద్ద మలుపు. ఇక ఈ పరిణామాలతో పాకిస్థాన్ లోపలే రాజకీయ ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదానికి తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని భారత్ జలరహితంగా రూపొందించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.