డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా… ఎవరు ఔనన్నా, కాదన్నా కూడా జగన్ కు కంచుకోట కింద లెక్కే. అంతేనా వైసీపికి గడప లాంటిది కడప జిల్లా. మొన్నటి సార్వత్రిక ఎన్నికలను మినహాయిస్తే… ప్రతి ఎన్నికలోనూ కడప జిల్లాలో జగన్ ఫ్యామిలీ సత్తా చాటుతోంది. అలాంటి కడప జిల్లాలో… కడప నగరానికి అతి సమీపంలో ఏపీలో అధికార కూటమి రథ సారథి, వైసీపీ రాజకీయ ప్రత్యర్థి టీడీపీ… తన వార్షిక వేడుక మహానాడును ఈ ఏడాది నిర్వహిస్తోంది. మంగళవారం మొదలైన టీడీపీ మహానాడు గురువారంతో ముగియనుంది. సరే… ఇదంతా బాగానే ఉంది గానీ… టీడీపీ మహానాడుతో కడప జిల్లాకు మహర్థశ అంటారేమిటి అని ప్రశ్నిస్తారా? సరే…అక్కడికే వెళ్లిపోదాం పదండి.
టీడీపీకి అధినేతగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గడచిన 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నారు. తాజాగా కడప మహానాడులో మరోమారు చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ అదినేతగా ఎన్నికైన తర్వాత కీలక ప్రసంగం చేసిన చంద్రబాబు ఉమ్మడి కడప జిల్లాకు వరాల జల్లు ప్రకటించారు. కడప జిల్లాలో ఉక్కు తయారీ పరిశ్రమ (స్టీల్ ఫ్యాక్టరీ)ని త్వరలోనే ప్రారంబిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఓ షెడ్యూల్ ను కూడా ప్రకటించడం గమనార్హం. పదంటే పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే అక్కడ కంపెనీని ఏర్పాటు చేయనున్న సంస్థకు డెడ్ లైన్ విధించామని తెలిపారు.
జూన్ 12న ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుందని…ఆలోగా కడప స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంబించి తీరాల్సిందేనని సదరు కంపెనీకి సూచించినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో తాము రాజీ పడేది లేదని కూడా ఆ కంపెనీకి తెగేసి చెప్పామన్నారు. ఈ ముహూర్తం దాటితే ఇక మీ వైపు చూడబోమని కూడా ఆ కంపెనీకి చెప్పామన్నారు. దీంతో జూన్ 12 లోగానే కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో తొలి దశలో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రెండో దశ కూడా పూర్తి అయితే మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ తో కడప రూపు రేఖలే మారిపోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు.
ఇక కడప జిల్లా పరిధిలోని గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, కేంద్రం నుంచి గండికోట ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో తాను హామీ ఇచ్చినట్లుగా గండికోటలో శ్రీకృష్ణదేవరాయలుకు చెందిన 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గండికోటను దేశంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా గండికోటను తీర్చి దిద్దనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆ స్థాయి, సత్తా గండికోటకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలోని చాలామందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఓ వైపు స్టీల్ ప్లాంట్, మరోవైపు గండికోట ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు మహానాడులో చంద్రబాబు చేయడం అంటే…మహానాడుతో జగన్ సొంత జిల్లాకు మహార్థశ పట్టినట్టే కదా.