ఔను! ఆ లేఖ నేనే రాశా.. కానీ: క‌విత

బీఆర్ ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్త‌వ‌మేన‌ని బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత తాజాగా వెల్ల‌డించారు. అమెరికాలో చ‌దువుతున్న త‌న కుమారుడి గ్రాడ్యుయేష‌న్ వేడుక‌ల్లో పాల్గొనేందుకు అక్క‌డ‌కు వెళ్లిన ఆమె తాజాగా శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు.దీనికి ముందు గురువారం రాత్రి అనూహ్యంగా ఆమె కేసీఆర్‌కురాసిన లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం.. రాజ‌కీయంగా ఈ లేఖ ర‌చ్చ‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్‌ను సూటిగా ప్ర‌శ్నించి తీరుపై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌సాగింది.

ఈ క్ర‌మంలో అమెరికా ప‌ర్య‌ట‌న కోసం వెళ్లిన ఆమె తిరిగి వ‌స్తూనే.. శంషాబాద్ విమానాశ్ర‌యంలో మీడియాతో మాట్లాడారు. తాను లేఖ రాసిన మాట నిజ‌మేన‌ని క‌విత చెప్పారు. అయితే.. ఇది జ‌రిగి రెండు వారాలు అయింద‌న్న ఆమె.. ఆ లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో మాత్రం త‌న‌కు తెలియ‌ద‌ని.. తాను కూడా ఆశ్చ‌ర్య‌పోయాన‌ని చెప్పుకొచ్చారు. పార్టీలో ఉన్న స‌మ‌స్య‌ల‌పైనే తాను పార్టీ అధినేత‌గా కేసీఆర్‌కు లేఖ రాశాన‌ని స‌మ‌ర్థించుకున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో తాను ఈ లేఖ రాసినట్టు చెప్పుకొచ్చారు.

“ఆ లేఖ నేను రాసిందే. పార్టీలోని కోవర్టులే లీక్ చేశారు. కేసీఆర్ దేవుడు… ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి… నా లేఖే బయటకు వచ్చిందంటే… ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి. కార్యకర్తల అభిప్రాయాలే… నా లేఖ ద్వారా చెప్పాను…” అని క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

పార్టీలో కొన్ని స‌మ‌స్య‌లు ఉన్న మాట కూడా వాస్త‌వ‌మేన‌ని అయితే.. వీటిని చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకుంటామ‌ని క‌విత తెలిపారు. దీనిపై అంద‌రితోనూ కేసీఆర్ చ‌ర్చిస్తార‌ని చెప్పారు. ఇక‌, తాను పార్టీ మారుతున్నాన‌ని కానీ.. పార్టీ పెడుతున్న‌ట్టుగా కానీ.. వ‌స్తున్న వార్త‌ల‌ను ఆమె ఖండించారు. తాను కేసీఆర్ బిడ్డ‌గా.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ అభివృద్ధిలో తాను కూడా భాగం అవుతాన‌ని చెప్పారు. పార్టీలోనే ముమ్మాటికీ ఉంటాన‌ని చెప్పుకొచ్చారు. పార్టీ త‌ర‌ఫున తాను ఎంపీగా ప‌నిచేశాన‌ని.. ఉద్యమాలు కూడా చేశాన‌ని తెలిపారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు రెండూ కూడా నాశ‌నం చేశాయ‌ని క‌విత ఈ సంద‌ర్భంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేసే శ‌క్తి ఉన్న నాయ‌కుడు కేసీఆర్ మాత్ర‌మేన‌ని క‌విత చెప్పారు. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు తాము కృషి చేస్తామ‌న్నారు. ఇత‌ర స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుని పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో కేసీఆర్‌కు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని క‌విత తేల్చి చెప్పారు. కాగా.. క‌విత రాసిన లేఖ‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ విధంగా ఆమె స్పందించ‌డంతో మ‌రి ఈ చ‌ర్చ‌ల‌కు ఇప్ప‌టికైనా ఫుల్ స్టాప్ ప‌డుతుందో లేదో చూడాలి.