వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… అదేదో రాజకీయం అంటే… రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య వాదులాట, దానిని మించి కొట్లాట వరకే పరిమితం అన్నట్లుగా భావించక తప్పదు. అదికారంలో ఉంటే…సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్… కనీసం మీడియాకు కూడా తన ముఖాన్ని చూపలేదు. అదే విపక్షంలో ఉంటే మాత్రం తన పార్టీ వారిని ప్రత్యర్థి పార్టీలు వేదిస్తున్నాయని, తాను అదికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటానని హెచ్చరికలు జారీ చేస్తూ సాగుతున్నారు.
ఇప్పుడే కాదు.. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఓటమి పాలు అయినప్పుడు జగన్ మీడియా ముందుకు వచ్చి… ఇప్పుడు వారు కొట్టారు.. తీసుకుంటాం.. రేపు మా వంతు వస్తుంది… తిరిగి అంతే బలంగా కొడతాం… అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంగళవారం విశాఖ జిల్లాలోని పలు స్థానిక సంస్తలకు చెందిన ప్రజా ప్రతినిదులతో జగన్ తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ ఆయన ఈ కొట్లాటల మాటలనే వల్లె వేయడం గమనార్హం. ప్రస్తుతం మనం విపక్షంలో ఉన్నామని గుర్తు చేసిన జగన్… అధికార పక్షం కొట్టినా కొట్టించుకునేందుకు సిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగగలం అని చెప్పారు.
”మిమ్మల్ని కొట్టిన వాళ్ల పేర్లన్నీ రాసిపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మరోమారు మన ప్రభుత్వమే అధికారం చేపడుతుంది. అప్పుడు ఆ పేర్లన్నింటినీ బయటకు తీద్దాం. వారి భరతం పడదాం..అంటూ జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. మనల్ని కొట్టినవాళ్లను మనం కూడా అదికారంలోకి వచ్చాక కొట్టి తీరదాం” అని జగన్ సూచించడం గమనార్హం. మొత్తంగా ప్రతీకార రాజకీయాలకు జగన్ ఆజ్యం పోస్తున్నారన్న వాదనలు కూడా ఈ తరహా వ్యాఖ్యలే కారణమని చెప్పక తప్పదు. జగన్ నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలే ఇదే తొలిసారి ఏమీ కాదు. ఇటీవలి జరుగుతున్న దాదాపుగా అన్ని పార్టీ సమావేశాల్లోనూ జగన్ ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు.