తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా భారత్ లోని పలు కీలక నగరాల్లో వరుస పేలుళ్లకు వ్యూహాలు రచిస్తున్న విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహ్మాన్ సహా, హైదరాబాద్ లో అతడి పార్టనర్ సయ్యద్ సమీర్ లు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులతో భారీ ఉపద్రవమే తప్పిందని చెప్పాలి. అయితే విచారణలో భాగంగా సిరాజ్ ఎంతటి కరడుగట్టిన నేరస్తుడో ఇట్టే తేలిపోయింది. తవ్వుతున్న కొద్దీ అతడు చెబుతున్న విషయాలు వింటూ ఉంటే… ఈ తరహా ఉగ్రవాదులు కూడా ఉంటారా? అన్న అనుమానాలు కలగక మానవు.
అసలు సిరాజ్ లక్ష్యాలు ఏమిటన్న విషయానికి వస్తే… ఒళ్లు జలదరిస్తుంది. భారత్ ను ఇస్లామిక్ దేశంగా తీర్చిదిద్దడమే అతడి అంతిమ లక్ష్యమట. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి ఉగ్రవాద దేశాలకే సాధ్యం కాని ఈ లక్ష్యం కోసం అతడు పనిచేయడం ప్రారంభించాడంటేనే నిజంగానే ఒళ్లు జలదరించక మానదు. ఇందుకు విద్వంసాన్నే మార్గంగా ఎంచుకున్న అతడు ఏకంగా మానవ బాంబులను తయారు చేసేందుకు సిద్ధపడ్డాడట. అందుకోసం పేలుడు పదార్థాల తయారీకి వినియోగించే పరికరాలతో పాటుగా ఆత్మాహుతి బాంబులుగా మారే వారిని కూడా సిద్ధం చేశాడట. ఈ భారీ లక్ష్యం కోసం పనిచేస్తున్న అతడికి అరబ్ దేశాల నుంచి భారీ ఎత్తున నిధులు అందుతూ వచ్చాయట.
విజయనగరం కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించడమే ఓ సాహసం అనుకుంటే… అక్కడి నుంచే సిరాజ్ హైదరాబాద్ సహఆ దేశంలోని పలు ప్రాంతాల్లోని తన ముఠా సభ్యులు, ఇతర దేశాల్లోని ఉగ్రవాద మాస్టర్ మైండ్లతోనూ నిత్యం సంప్రదింపులు జరిపాడు. అంతేనా… దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు అవసరమైన బాంబుల తయారీని కూడా అతడు విజయనగరం కేంద్రంగానే చేపట్టేందుకు సిద్ధపడటం గమనార్హం. ఇందుకోసం అతడు ఏకంగా టిఫిన్ బాక్సులు, బ్యాటరీలు వంటి వాటిని ఈ కామర్స్ సంస్థల నుంచి ఆర్డర్లు పెట్టి తెప్పించుకున్నాడట. మరికొంత కాలం పాటు అతడు దొరక్కపోయి ఉంటే… అతడు భారీ విధ్వంసానికే పాల్పడేవాడు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పిందని చెప్పాలి.