పాక్‌కు మేకులా మారిన సొంత రాష్ట్రం!

కాశ్మీర్ కోసం దశాబ్దాలుగా భారత్‌పై దొంగదారిలో విరుచుకుపడుతూ, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు చుట్టు పక్కల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాశ్మీర్ కావాలని పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నించినా, ఇప్పుడు తనే ఆక్రమించి ఉన్న బలూచిస్థాన్‌ను చేజార్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. స్వతంత్ర బలూచిస్థాన్ కోసం పోరాటం చేస్తున్న నేతలు, ప్రజలు బహిరంగంగానే తమ వాయిస్ వినిపిస్తూ ‘పాకిస్థాన్ మాకు అవసరం లేదు’ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈ మాటలకు నిదర్శనం.

తాజాగా బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలోచ్ చేసిన ప్రకటన పాకిస్థాన్‌కు మరో షాక్‌లాంటిది. “మేము పాకిస్థానీయులు కాదంటూ” ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. కొన్నేళ్లుగా పాక్ దుర్మార్గాలను భరించిన బలూచ్ జనతా ఇప్పుడు మౌనంగా ఉండే పరిస్థితిలో లేరు. భారత్ పీవోకేపై చర్యలు తీసుకునే సమయంలోనే బలూచిస్థాన్ నుంచి వచ్చిన స్వరాలు పాక్‌ను అర్థరాత్రి నిద్రలేపేలా ఉన్నాయి.

ఇక పాక్‌కు నిజంగా మిత్ర దేశాలే మిగిలేనా అనే సందేహం కూడా వినిపిస్తోంది. ఉగ్రవాదంపై మద్దతు నిలిపి పెట్టమన్న ప్రపంచ దేశాల మాటకు చెవిచెయ్యని ఇస్లామాబాద్‌, ఇప్పుడు తాను ఆక్రమించిన భూభాగాన్నే పోగొట్టుకునే పరిస్థితిలోకి వచ్చిందంటే ఇదే కర్మ ఫలితమే అనుకోవాలనే కామెంట్స్ వస్తున్నాయి. సొంత రాష్ట్రమే చెబుతోందంటే, పాక్‌కు మరెవరి బలం పనికిరాదని స్పష్టమవుతోంది. అసలే బలూచిస్థాన్‌ నుంచే పాక్ కు ఆదాయం వనరులు సమకూరుతున్నాయి. గోల్డ్, బొగ్గు, గ్యాస్ లాంటి ఖనిజ వనరులు ఆ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి బలూచిస్థాన్‌ చేజారింది అంటే పాక్ సర్దుకోవాల్సిందే.