ఈ ఎంపి సమస్యేంటో అర్ధం కావటం లేదే ?

పార్టీ ఏమో ఈ ఎంపిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరింది. కానీ ఈయనేమో తాను వైసీపీ ఎంపినే అంటు చెప్పుకుంటున్నారు. టెక్నికల్ గా ఎంపి చెబుతున్నది కరెక్టే కానీ పార్టీ మాత్రం అలా అనుకోవటం లేదు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల నుండి ఎంపిని దాదాపు వెలేసినట్లే అర్ధమైపోతోంది. ఈపాటికే విషయం అర్ధమైపోయుండాలి. అవును నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు గురించే ఇదంతా.

మొన్నటి ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గగంలో వైసీపీ ఎంపి గెలిచిన కృష్ణంరాజుకు తర్వాత అధినేత జగన్మోహన్ రెడ్డితో వివాదం మొదలైంది. అది కాస్త బాగా గ్యాప్ పెరిగిపోవటంతో తిరుగుబాటు ఎంపిగా తయారయ్యారు. మామూలుగా అయితే పార్టీల అధినేతతో పడకపోతే సదరు ఎంపినో లేకపోతే ఎంఎల్ఏ, నేతో పార్టీలో నుండి బయటకు వచ్చేస్తారు. కానీ రఘురామ మాత్రం పార్టీని వదిలి బయటకు రావటం లేదు. అలాగని పార్టీ కూడా ఎంపిపై సస్పెన్షన్ వేటు వేయలేదు. ఏకంగా అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది.

అప్పటి నుండి జగన్ సర్కారు టార్గెట్ గా ఎంపి మాట్లాడుతున్నారు ప్రతిరోజు. జగన్ ఎల్లోమీడియా అని చెప్పే మీడియా ఎంపి మాటలకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇదే సమయంలో మీడియాతో మాట్లాడేటపుడు మన పార్టీ, మన నేత, మన ప్రభుత్వం అంటు తనను తాను వైసీపీ నేతగానే చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీలో ఉండటమే ఎంపికీ ఇష్టం లేదు. అదే సమయంలో ఈయన్ను తమ నేతగా గుర్తించటానికి పార్టీ కూడా ఇష్టపడటం లేదు. అలాంటపుడు కావాలనే తనను తాను ఇంకా వైసీపీ నేతగానే ఎంపి ప్రొజెక్టు చేసుకుంటున్న విషయం అర్దమైపోతోంది.

ఎంపిగా రాజీనామా చేయటం రఘురామకు ఇష్టం లేదు. పార్టీ నుండి సస్పెన్షన్ వేటు వేయించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపిపై సస్పెన్షన్ వేటు కాకుండా ఏకంగా అనర్హత వేటే వేయించేందుకు పార్టీ కూడా ప్రయత్నిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది పార్టీకి, ఎంపికి కూడా సంధికాలమనే చెప్పాలి. తాజాగా జగన్ గురించి మాట్లాడుతూ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కన్నా తమ నేత జగన్ గొప్పోడు కాదంటు కామెంట్ చేశారు. వైఎస్సార్ కన్నా జగనే బాగా పనిచేస్తున్నాడని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.

నిజానికి పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏవిషయాన్నైనా ఎంపి అంగీకరించినా అంగీకరిచకపోయినా ఒకటే. ఎందుకంటే రఘురామను పార్టీ ఎంపిగా నేతలే పట్టించుకోవటం లేదు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎంఎల్ఏలు ఎంపిని గుర్తించటం లేదు. ఇతర నేతలు కూడా ఎంపిని పట్టించుకోవటం లేదు. జనాలు కూడా బహుశా ఎంపిని మరచిపోయారేమో. ఎందుకంటే నియోజకవర్గంలో కి వస్తే ఏమి గొడవవుతుందో అని ఎంపి కూడా నియోజకవర్గాన్ని వదిలేసి చాలా కాలమే అయ్యింది. మొత్తానికి మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో మాట, పూటకో ఆరోపణ చేస్తు కాలం వెళ్ళదీస్తున్నాడు రఘురామ కృష్ణంరాజు.