వేతనంతోనూ సేవ.. పవన్ కే సాధ్యం

అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా స్టార్లకు రాజకీయాలు ఫ్యాషన్ గా మారాయిలే… పవన్ కూడా ఆ దిశగానే రాజకీయాల్లోకి వచ్చారులే అంటూ పలువురు ఇదివరకు వ్యాఖ్యలు చేసినా… ఇప్పుడు పవన్ చేస్తున్న సేవను చూసి మాత్రం నివ్వెరపోతున్నారు. గతంలో ఏ ఒక్కరికీ తట్టని రీతిలో సరికొత్త రీతిలో సేవను చేస్తూ సాగుతున్న పవన్… శుక్రవారం ఎమ్మెల్యేగా తనకు వస్తున్న వేతనంతో పవన్ సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వాస్తవంగా నటుడిగా ఉన్నప్పుడు కూడా పవన్ సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాయి. అందులో భాగంగా శుక్రవారం ఓ కొత్త సేవకు పవన్ శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధిగా కొనసాగినంత కాలం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కూడా పవన్ ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్యే హోదాలో పవన్ కు ప్రతినెలా వేతనం కింద రూ.2.10 లక్షలు అందుతున్నాయి. ఈ మొత్తాన్ని పిఠాపురం పరిధిలో అనాథ పిల్లలకు సరిసమానంగా పంపిణీ చేయాలని పవన్ తీర్మానించారు.

పవన్ ఆదేశాలతో ఆయన యంత్రాంగం పిఠాపురం పరిధిలో ఎంతమంది పిల్లలు అనాథలుగా ఉన్నారన్న వివరాలను బయటకు తీశారు. ఈ వివరాల సేకరణలో పిఠాపురంలో మొత్తం 42 మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తేలింది. వీరందరికీ తన వేతనాన్ని సరిసమానంగా పంపిణీ చేయాలని పవన్ తీర్మానించారు. అనుకున్నట్లుగానే… శుక్రవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి వారందరినీ పిలిపించి.. ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున పంపిణీ చేశారు. ఈ సేవను తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం కొనసాగిస్తానని కూడా పవన్ పేర్కొన్నారు.

వాస్తవానికి ఓ ప్రజా ప్రతినిధిగా వేతనమే తీసుకోకూడదని పవన్ తొలుత భావించారట. అయితే ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న భావనతో వేతనం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. వేతనం కింద అందిన ఈ మొత్తాన్ని తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజలకే ఖర్చు చేయాలని అనుకున్నానని.. అది కూడా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ పిల్లలకు వారి ఇళ్ల వద్దకే ఈ మొత్తాన్ని పంపేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పవన్ తెలిపారు.

శుక్రవారం మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపికైన పిల్లల్లో 32 మంది మాత్రమే వచ్చారు. వివిధ కారణాలతో మంగళగిరికి రాలేకపోయిన పిల్లలకు వారికి కేటాయించిన మొత్తాన్ని వారి ఇళ్ల వద్దే వారికి అందించే ఏర్పాట్లను పవన్ చేశారు. ఈ సందర్భంగా పవన్ చేపట్టిన ఈ కొత్త తరహా సేవ గురించి ఆయన వద్ద వ్యక్తిగత కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అదికారి కృష్ణతేజ మాట్లాడుతూ… ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తామంతా వచ్చి పవన్ వద్ద చేరిన తర్వాత… తన వేతనాన్ని ఇలా ఖర్చు చేయాలని చాలా రోజుల క్రితమే పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.