సైకో పోయినా… ఆ చేష్టలు మాత్రం పోలేదు

2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో పోవాలి…సైకిల్ రావాలి అంటూ వినిపించిన ఈ నినాదం కూటమి విజయానికి ఓ బ్రహ్మాస్త్రం మాదిరిగానే పని చేసింది. రాజధాని అమరావతి పట్ల జగన్ వ్యవహరించిన తీరు సైకో మాదిరిగానే ఉందని టీడీపీ శ్రేణులు, రాజదాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు భావించారు తమలోని భావనను వారు రాష్ట్రవ్యాప్తం చేయడంలో సఫలీకృతం అయ్యారు. ఎన్నికల్లో సైకోగా ముద్రపడిపోయిన జగన్ అధికారం నుంచి దిగిపోయారు. అయితే నాటి సైకో పాలనలో చోటుచేసుకున్న సైకో చేష్టలు మాత్రం ఇప్పటికీ పోలేదనే చెప్పాలి.

నిజమే… ఏపీలో సైకో పాలన ముగిసినా… సైకో చేష్టలు ముగిసిపోలేదన్న మాటను నిజం చేస్తూ శనివారం రాజధాని అమరావతి పరిధిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అమరావతి పరిధిలోని సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల బ్లాక్ ల నిర్మాణం కోసం 2018లో నాటి సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ప్రారంభించారు. శనివారం దాకా ఆ శిలాఫలకం చెక్కు చెదరకుండానే కనిపించగా… శనివారం తెల్లారేసరికే శిలాఫలకం ధ్వంసమైపోయింది. శిలాఫలకం ముందు భాగంలో దానిని ప్రారంభించిన నాటి సీఎం చంద్రబాబు, ఇతర ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్న ఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు.

ఈ ఘటన వెలుగులోకి రాగానే కూటమి సర్కారు షాక్ కు గురైంది. ఎందుకంటే… రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను శుక్రవారమే కూటమి సర్కారు ఘనంగా నిర్వహించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి సమయంలో అమరావతిలో ఓ కీలక భవన సముదాయ శిలాఫలకాన్ని ఇలా దుండగులు ధ్వంసం చేయడం కూటమి సర్కారును షాక్ కు గురి చేసింది. ఈ చర్య ద్వారా రాజధాని అమరావతిపై ఆ సైకోలు ఇంకా తమ వైఖరిని మార్చుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ వైపు పున:నిర్మాణం ఘనంగా జరిగిన రోజు రాత్రే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని చెబుతున్నారు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కారు పోలీసులను రంగంలోకి దించింది. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరో తేల్చాలంటూ సర్కారు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సర్కారు ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు… ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఉన్నదెవరు? అన్న విషయంపై ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు… పాత్రధారుల వేట మొదలుపెట్టారు. అయితే ఈ కేసులో పాత్రధారుల కంటే కూడా సూత్రధారులను తేల్చే దిశగానే దర్యాప్తు సాగుతోంది. వెరసి భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసే దిశగా కూటమి సర్కారు కదులుతోంది.