వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి తెల్లటి జుట్టు, తెల్లటి గడ్డంతో కనిపించడం అందరికీ తెలిసిందే. ఆయన ఎంత బిజీగా ఉన్న ఎంత పనిలో ఉన్నా.. తన కాస్ట్యూమ్, బియార్డ్, హెయిర్ విషయంలో పక్కాగా ఉంటారు. ఎందుకంటే.. ఒక్కొక్క సారి ఆయన అనూహ్యంగా జాతీయ మీడియాతోనూ మాట్లాడుతుంటారు. దీంతో ఎప్పుడూ నీట్గా ఉంటారు. అయితే.. ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. విజయసాయిరెడ్డి హఠాత్తుగా గుండుతో ప్రత్యక్షమయ్యారు.
తెల్లగా రజత వర్ణంలో మెరిసే.. జుట్టు, గడ్డం రెండూ లేకుండా.. క్లీన్గా కనిపించారు. పక్కన ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఆయన ఈ మేరకు ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సాయిరెడ్డి హటాత్తుగా ఇంత ‘క్లీన్’గా కనిపించడానికి కారణం.. తాజాగా శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకు న్నారు. వాస్తవానికి ఆయన శ్రీవారిని తరచుగా దర్శించుకుంటూనే ఉన్నారు. కానీ.. ఎప్పుడూ తలనీలాలు ఇచ్చింది లేదు. ఇలా వెళ్లి అలా బయటకు వచ్చేస్తారు. కానీ, ఈ దఫా మొక్కు తీర్చుకున్నట్టుగా ఉన్నారు.
ఇక, సాయిరెడ్డికి ప్రస్తుతం ఎలాంటి హోదా లేదు. ఆయన ఏ పార్టీలోనూ లేనని చెబుతున్నారు. ఇక, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ..తిరుమలలో ఆయనకు అఖండ స్వాగతం లభించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జేఈవో స్వయంగా ఆయనను ఆహ్వానించడం.. నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లి.. దర్శనం చేయించడం.. అనంతరం రంగనాయక మండపంలో ఆశీర్వాదం, ప్రసాదాల అందజేత వంటి లాంఛనాలు పరిపూర్ణంగా జరిగిపోయాయి. మరి దీనివెనుక ఏ మహత్తు ఉందో.. అని సాయిరెడ్డి అభిమానులు చర్చించుకోవడం గమనార్హం. దీనికంటే కూడా.. ఆయన గుండుతో కనిపించడంపై ఎక్కువగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates