రీస్టార్ట్ కాదు..అమరావతి స్టార్ట్ చేసేదీ మోదీనే: చంద్రబాబు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ మళ్లీ వస్తారని చంద్రబాబు అన్నారు. అమరావతి మా రాజధాని అని అందరూ గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని చెప్పారు.

అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహన రాజధానిగా, బౌద్ధుల అభిృద్ధికి కేంద్రంగా కష్ణమ్మ తీరాన విలసిల్లిన అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని అన్నారు. అమరావతి ఒక నగరం కాదని..అదొక సెంటిమెంట్ అని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు.రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు 39 వేల ఎకరాల భూములు ఇచ్చారని.. ఎవరినీ అసంతృప్తికి గురిచేయబోమని అన్నారు.

అమరావతి రాజధాని ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, రైతులు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని, వైసీపీ ప్రభుత్వం చిత్ర హింసలు పెట్టినా ఎక్కడా తలొగ్గలేదని ప్రశంసించారు. వైసీపీ విధ్వంస పాలనకు ఎదురొడ్డి రైతులు నిలిచారని, ప్రాణాలకు తెగించి రైతులు పోరాడి అమరావతి రాజధానిని సాధించుకున్నారని కొనియాడారు.

సరైన సమయంలో సరైన నేత దేశానికి ప్రధానిగా ఉన్నారని మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో మోదీతో భేటీ అయ్యానని, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన గంభీరంగా కూర్చొని ఉన్నారని అన్నారు. మోదీజీ ఉగ్రవాద నిర్మూలనలో కేంద్రం చేపట్టే ప్రతి చర్యకు అండగా ఉంటాం, ఈ విషయంలో ప్రధానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని ప్రతిజ్ఞ చేస్తున్నాం అని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. మోడీ కొత్త ఇండియాను నిర్మిస్తున్నారని, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్న అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దేశాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారని, మోడీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతుందని తెలిపారు.