మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ రాజధానికి సంబంధించిన కొన్ని డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది. రాజధాని కోసం ఏం అడగాలి అనే విధివిధానాల కోసం ‘అమరావతి క్యాపిటల్ కమిటీ’ ప్రకటించింది. ఈ క్రమంలోనే 2015లో ప్రధాని మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంను సందర్శించేందుకు వెళుతున్న షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో, పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. షర్మిల నివాసం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. తనను పట్టుకున్న మహిళా పోలీసులపై షర్మిల ఫైర్ అయ్యారు. చేయి తీయ్..నా మీద చేయి వేసే అధికారం మీకు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ కమిటీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకుండానే కూటమి ప్రభుత్వం భయపడుతోందని, పోలీసులతో అడ్డుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. బయటకు రానీయకుండా ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. అయితే, తాను కచ్చితంగా ఉద్దండరాయునిపాలెం వెళ్లి తీరుతానని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో, అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.