సింహాచలంలోని అప్పన్న ఆలయం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఘటన విషయం తెలియగానే.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి అనిత తెలిపారు. అయితే.. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. వైసీపీ హయాంలో ఇక్కడ గోడ నిర్మించడం.. అది నాణ్యత లేదని తాజాగా అధికారులు గుర్తించడం గమనార్హం.
వాస్తవానికి కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రసాదం పథకం’ కింద 2021-22 మధ్య ఈ గోడ నిర్మించారు. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. అయితే.. తాజాగా జరిగిన గోడ కూలిన ఘటనలో నాణ్యత లోపాలు బయటకు కనిపించాయి. సిమెంటు ఇటుకలను వినియోగించి.. ఈ గోడను నిర్మించారు. అయితే.. ఇటుక-ఇటుక మధ్య సిమెంటు తాపడం.. ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇటుకలు పొడి పొడిగా కూడా ఉన్నాయి. దీంతో నాణ్యత లోపం స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.
ఇక, బుధవారం తెల్లవారు జాము వరకు కూడా సింహాద్రిపై భారీ వర్షం కురిసింది. దీంతో గోడ పూర్తిగా నాని.. ఒక్కసారిగా కూలిపోయింది. ఆ పక్క నుంచే క్యూ లైన్ ఉండడంతో భక్తులపై గోడ పడింది. ఈ ఘటనలో 8 మంది వరకు భక్తులు మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మంత్రి వంగలపూడి అనిత.. వైసీపీ హయాంలోనే నాణ్యతలేని నిర్మాణాలు చేపట్టారని.. అందుకే ఇప్పుడు దుర్ఘటన చోటు చేసుకుందని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామన్నారు.