పాకిస్తానీలను భారత్ నుండి ఖాళీ చేయించడం కష్టమేనా..?

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మొన్న కశ్మీర్ లోని పెహల్ గాంలో భీకర దాడికి దిగారు. 25 మంది భారతీయులను, ఒక నేపాల్ వాసిని పొట్టనబెట్టుకున్నారు. ఈ పరిణామం భారత ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. యావత్తు భారతీయులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగా సాగిన కేంద్ర ప్రభుత్వం… పాక్ పై కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాక్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది. అంతేకాకుండా దౌత్యవేత్తలతో సహా పాక్ జాతీయులంతా భారత్ వీడి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. అందుకు గడువు కూడా విధించింది. ఆ గుడువు కూడా ముగింపునకు చేరుకుంది. మరి గడువులోగా పాకిస్తానీలు భారత్ వీడకుంటే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చిక్కు ప్రశ్న గా మారింది. 

భారత్ లో వేలాది మంది పాకిస్తానీలు ఉన్నారు. వీరిలో దౌత్యవేత్తలు ఎలాగూ ఇప్పటికే భారత్ వీడారు. పర్యాటక వీసాల మీద వచ్చిన వారు కూడా భారత్ విడినట్టేనన్న సమాచారం అందుతోంది. ఇలాంటి నేపథ్యంలో వైద్యం కోసం భారత్ వచ్చిన పాకిస్తానీలు తిరిగి వెళ్లే విషయం ఒకింత జఠిలంగా మారిపోయింది. వాస్తవానికి భారత్ వస్తున్న పాకిస్తానీల్లో మెజారిటీ మంది మెడికల్ వీసాల మీదే వస్తున్నారు. వీరంతా భారత్ లోని వివిధ ప్రాంతాల్లో చికిత్సలు కూడా తీసుకుంటున్నారు. వీరిలో కూడా మెజారిటీ మంది హైదరాబాద్ లోనే ఉన్నట్లు సమాచారం. అతి తక్కువ వ్యయంతోనే అత్యంత మెరుగైన వైద్యం అందుతున్న నేపథ్యంలో పాకిస్తానీలు వైద్యం కోసం ముందుగా భారత్ నే ఎంచుకుంటున్నారు. మరి వీరిని చికిత్స మధ్యలోనే తిరిగి పాక్ కు పంపడం సాధ్యమేనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇతర వీసాదారుల విషయంపై భారత్ తో సహా ఇతర దేశాలు కూడా కఠినంగానే వ్యవహరిస్తాయి. అందులో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాదు. మరి మెడికల్ వీసాల మీద వచ్చే విదేశీయులను ఉన్నపళంగా తిరిగి వారి స్వదేశాలకు పంపాలంటే అప్పటికప్పుడు అయ్యే పని కాదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే… ఈ వీసాలపై వచ్చే వారిలో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో మాదిరిగా ఉంటుంది. కొందరికి రోజుల్లోనే వైద్యం పూర్తి అవుతుండగా.. మరికొందరికి నెలల తరబడి వైద్యం అవసరం అవుతుంది. మరి ఇలాంటి వారిని తిరిగి వారి దేశాలకు పంపించాలంటే… చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా… అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదు. మెడికల్ వీసాలపై వచ్చిన పాకిస్తానీలు ఈ నెల 29 అంటే.. మంగళవారంలోగా భారత్ ను వీడాల్సి ఉంది. అయితే గడువు ముగుస్తున్నా… ఈ దిశగా పెద్దగా పురోగతి కనిపించలేదనే చెప్పాలి.

భారత్ లోని చాలా రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న పాకిస్తానీల సంఖ్య వేలల్లోనే ఉన్నట్లు సమాచారం. అయితే ఎంతమంది ఇలాంటి చికిత్సలు తీసుకుంటున్నారు? వారిలో ఎవరెరవరి పరిస్థితి ఎలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. ఇతరత్రా వీసాల మీద భారత్ వచ్చి గడువులోగా తిరిగి వెళ్లని పాకిస్తానీలపై చర్యలు తీసుకునే విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే కఠిన నిబంధనలను ప్రకటించింది. మొన్నటిదాకా ఉన్న జరిమానా, జైలు శిక్షలను పెంచేసింది. అయితే మెడికల్ వీసాలపై వచ్చిన వారి విషయంలో మాత్రం ఎలా ముందుకు సాగాలన్న దానిపై కేంద్రం ఇంకా తర్జనభర్జన పడుతోంది. ఈ వీసాలపై అప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. అంతర్జాతీయ సంస్థల విధివిధానాల ఆధారంగా ముందుకు సాగే విషయంపై కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ దిశగా తుది నిర్ణయం ఎప్పటిలోగా తీసుకుంటారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. వెరసి భారత్ లో ఉన్న పాకిస్తానీ రోగులను ఇప్పటికిప్పుడు తిప్పి పంపడం అంత సులువు కాదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

పైగా ఏప్రిల్ 29 లోపు పాకిస్తానీలు దేశాన్ని వీడకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 3 లక్షల జరిమాన కూడా విధిస్తారన్న వార్త విద్య చికిత్స నిమిత్తం ఇంకా దేశంలోనే మిగిలిఉన్న పాకిస్తానిలను అయోమయంలో పడేసింది. ఇక వీరి విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.