ఈ సారి వారి కోసం క‌దిలిన‌.. నారా భువ‌నేశ్వ‌రి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి.. స్వచ్ఛంద కార్య‌క్ర‌మాల‌లో దూకుడుగా ఉంటున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయంగా కూడా స‌త్తా నిరూపించుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ప్ర‌జా సేవ‌లో త‌న‌దైన కోణాన్ని ఆవిష్క‌రించారు. ఈ క్ర‌మంలో గ‌త నెల‌లో విజ‌య‌వాడ‌లో కేన్స‌ర్ బాధితుల కోసం.. త‌మ‌న్‌తో క‌లిసి.. మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ నిర్వ‌హించారు. దీని ద్వారా వ‌చ్చిన సొమ్మును కేన్స‌ర్ రోగుల చికిత్స‌.. వారికి సాయం కోసం వినియోగించారు. ఇప్పుడు మ‌రో గురుత‌ర బాధ్య‌త‌ను నారా భువ‌నేశ్వ‌రి భుజాన వేసుకున్నారు.

అదే.. త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డే రోగుల‌ను ఆదుకునేందుకు ఆమె న‌డుం బిగించారు. ఈ క్ర‌మంలో  మే 8న విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో 3 కిలో మీట‌ర్లు, 5 కిలో మీట‌ర్లు, 10కిలో మీట‌ర్లు ప‌రుగును నిర్వహించనున్నారు. ఈ మేర‌కు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా కూడా ఉన్న‌ నారా భువనేశ్వరి తెలిపారు. విజయవాడలో శుక్ర‌వారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. “ఓ గొప్ప లక్ష్యం కోసం ఈ రన్‌ను నిర్వహిస్తున్నాం ఇందులో పాల్గొని తలసేమియా బాధితులకు అండగా వుంటామన్న భరోసా కల్పిద్దాం. రండి ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కండి“ అని ఆమె కోరారు.

ర‌క్తదానాన్ని ప్రోత్స‌హించే ఉద్దేశంతోనే.. ఈ ప‌రుగును చేప‌డుతున్న‌ట్టు నారా భువ‌నేశ్వ‌రి చెప్పారు. త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డేవారికి ర‌క్త మార్పిడి అవ‌స‌ర‌మ‌ని.. ఈ రోగుల‌కు ప్ర‌తి నెలా ఒక్క‌సారి ర‌క్తం మార్చాల‌ని వైద్యులు చెబుతున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ర‌క్త దాత‌ల‌ను మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు.. ఈ ర‌న్‌ను చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ నాలుగు మాసాల‌కు ఒక్క‌సారి ర‌క్త‌దానం చేయాల‌ని.. త‌ద్వారా వేలాది మంది త‌ల‌సేమియా వ్యాధి గ్ర‌స్థుల‌కు జీవితం ప్ర‌సాదించిన‌ట్టు అవుతుంద‌ని పేర్కొన్నారు.