అధికారం చెల్లిది.. ప్రజలు గెలిపించింది కూడా ఆమెనే. కానీ.. పెత్తనం మాత్రం అన్నదమ్ములు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం.. టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇదేంటని.. చంద్రబాబు వరకు కూడా విషయం చేరింది. నిజానికి గత 2024 ఎన్నికలలో టీడీపీ పలువురు కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చింది. వివిధ కారణాలతో సీనియర్ నాయకులను పక్కన పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వారి కుటుంబాలకు చెందిన వారికే టికెట్లు ఇచ్చారు.
ఇలా.. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలివల సుబ్రహ్మణ్యంను తప్పించిన చంద్రబాబు ఆయన కుమార్తె విజయశ్రీకి పగ్గాలు అప్పగించారు. కూటమి హవాలో విజయశ్రీ కూడా.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆమె పేరుకు ఎమ్మెల్యే తప్ప.. పెత్తనం అంతా.. అన్నదమ్ములు.. రంజిత్, రాజేష్లు చక్క బెడుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదేం పద్ధతని కూడా.. వారు ప్రశ్నిస్తున్నారు.
సరే.. పెత్తనం అయితే.. చేస్తున్నారు. కానీ.. ప్రకృతి సంపదను కూడా.. సొంతం చేసుకునే ప్రయత్నం చేయడమే ఇబ్బందిగా మారింది. నియోజవకర్గంలో ఇసుక ముమ్మరంగా లభిస్తోంది. అదేవిధంగా గ్రావెల్ కూడా ఉంది. దీనిని ఎమ్మెల్యే సోదరులు బహిరంగంగానే తరలించేస్తున్నారని పార్టీ నాయకులే చెబుతు న్నారు. ఇక, స్థానికంగా కూడా.. పెద్ద ఎత్తున ఈ విషయం చర్చకు వచ్చింది. పొరుగున ఉన్న తమిళనాడుకు నిత్యం వందల కొద్దీ లారీలు తరలిపోతున్నట్టు చెబుతున్నారు.
ఇక, ప్రజల సమస్యల విషయానికి వస్తే..రెండు మండలాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కానీ, అక్కడ తలుపులు తీసేవారు.. ఎవరూ లేకపోవడంతో ప్రజలకు సదరు కార్యాలయాలు చేరువ కాలేక పోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు.. ప్రజలకు సమస్యలే లేవన్నట్టుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని.. స్థానిక మండల స్థాయి నాయకులు ఇటీవలె ప్రజాదర్బార్లో ఫిర్యాదులు చేయడం మరింత చర్చకు వచ్చింది. దీనిపై పార్టీ అధిష్టానం పట్టించుకుని చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.