సస్సెన్షన్ పై దువ్వాడ మార్కు రియాక్షన్!

ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన, దువ్వాడ తీరుపై మంగళవారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ తనకు అన్యాయం చేశారని దువ్వాడ ఏకంగా బోరుమంటూ విలపిస్తున్నారని కొందరంటే… అదేమీ లేదు.. టీడీడీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ను పొగిడినందుకే దువ్వాడపై జగన్ వేటు వేశారంటూ మరికొందరు తమవైన శైలి విశ్లేషణలు వినిపించారు.

కొందరైతే దువ్వాడపై వేటు వేసేందుకు జగన్ కు ఇష్టమే లేదని కూడా గతానుభవాలను బయటకు తీసి మరీ చూపించారు. ఇవన్నీ అలా ఉంటే.. తనపై పడిన సస్పెన్షన్ వేటుపై తాజాగా దువ్వాడనే స్వయంగా ప్రతిస్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన స్పందనతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వైరల్ అయిపోయింది.

రాజకీయంగా తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది జగనేనని దువ్వాడ చెప్పారు. తనను ఇంతవాడిని చేసిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన దువ్వాడ… తన మనసులో జగన్ ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. ఇక సస్పెన్షన్ కు సరికొత్త అర్థం చెప్పిన దువ్వాడ… సస్పెన్షన్ అంటే కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని తేల్చేశారు. త్వరలోనే రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తానని కూడా ఆయన తెలిపారు. వెరసి జగన్ తనను పార్టీ నుంచి గెంటేసినా కూడా తనకు జగన్ మీద నమ్మకం పోలేదని దువ్వాడ చెప్పినట్టైంది. తిరిగి తాను వైసీపీలో కీలకంగా మారతానన్న నమ్మకం తనకు ఉందన్న మాటను కూడా ఆయన ఒకింత గట్టిగానే వినిపించారని చెప్పక తప్పదు.

వాస్తవానికి దువ్వాడపై ఎప్పుడో సస్పెన్షన్ వేటు పడాల్సి ఉందని… అయితే జగన్ ఎందుకో గానీ దువ్వాడ ఏం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా అలా ఉండిపోయారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొన్నటి పీఏసీ భేటీలో పలువురు నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దువ్వాడపై జగన్ వేటు వేశారని సమాచారం.

వాస్తవానికి కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను వదిలేసి వేరే మహిళతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న దువ్వాడపై వైసీపీ నేతలు చాలా సీరియస్ గానే ఉన్నారు. అయితే జగనే దువ్వాడను అలా లైట్ తీసుకున్నారని చెప్పాలి. 25 ఏళ్ల క్రితమే రాజకీయం ప్రారంభించిన దువ్వాడ పదేళ్ల పాటు అదే పార్టీలో కొనసాగి… ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా 2009లో టెక్కలి నుంచి బరిలోకి దిగిన దువ్వాడ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరారు.

2014లో రెండో సారి వైసీపీ తరఫున టెక్కలి నుంచే పోటీ చేసి మరోమారు ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం లోక్ సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు గట్టి పోటీ అయితే ఇచ్చారు గానీ.. వరుసగా మూడో సారి కూడా ఓడిపోయారు. 2021లోనే ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నా 2024 ఎన్నికల్లో తిరిగి టెక్కలి నుంచే పోటీ చేసి నాలుగోసారీ ఓటమిపాలయ్యారు. ఫలితంగా ఎమ్మెల్యే కావాలన్న దువ్వాడ కోరిక 25 ఏళ్లు గడుస్తున్నా కానీ తీరడం లేదు. ఇలాంటి సమయంలోనే ఆయనపై వైసీపీ వేటు వేయడం, దానిపై దువ్వాడ సానుకూలంగా స్పందించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.