లోకేష్ టీంకు చాలానే ప‌ని ప‌డిందా..?

లోకేష్ టీంకు చాలానే పని పడిందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న స్వల్ప గ్యాప్ ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ప్రజల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాలని వారికి వివరించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు నాయకులు కుమ్ములాటలు పక్కన పెట్టి ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆయన హిత‌వు పలుకుతున్నారు.

అయినప్పటికీ చాలామంది నాయకులు ఈ పనిని వదిలేసి తమ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నా రు. ఇప్పటికే అనేకసార్లు చంద్రబాబు హెచ్చరించినప్పటికీ దాదాపు పది జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని నారా లోకేష్ కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చూస్తూ ఊరుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయని భావించిన‌ నారా లోకేష్ తన టీమును రంగంలోకి దింపేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా నారా లోకేష్ టీం చాలా బాగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఆయన పాదయాత్ర చేసినప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండి పాదయాత్రను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అదే విధంగా మంత్రి అయిన తర్వాత కూడా ఆయన దైనందిన కార్యక్రమాలతో పాటు ప్రజలకు చేరువవుతున్న విషయాలను కూడా సమగ్రంగా వివరించడంలో నారా లోకేష్ టీం అద్భుతమై న మార్పులు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వారికి అప్పజెప్పాలని ఉద్దేశం ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

తద్వారా వైసిపి చేసే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయడం అదేవిధంగా చంద్రబాబు చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించటం వంటి కీలకమైన బాధ్యతలను వారికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా సభ్యత్వాలు ఉన్న టిడిపిలో ఇప్పు డు జిల్లాల వారీగా నారా లోకేష్ టీమ్లను కొత్తగా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదే జరిగితే నాయకుల కంటే కూడా నారా లోకేష్ టీం బాగా పనిచేస్తుందని తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.