ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన వీరయ్య చౌదరి ఇంటికి వెళ్లి మృత దేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృత దేహంపై స్వయంగా టీడీపీ జెండాను కప్పారు. అనంతరం.. కొద్ద దూరం అంతిమయాత్రలోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయ హంతకులను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని శపథం చేశారు. “53 చోట్ల దారుణంగా కత్తితో పొడిచారు. వీళ్లు మనుషులేనా? కాదు.. మృగాలు. ఇలాంటివారికి సమాజంలో ఉండే అర్హత లేదు. వీరితో సమాజానికే కాదు.. రాష్ట్రానికి కూడా ప్రమాదం. కరుడు గట్టిన నేరస్థులు కూడా ఇంత దారుణం చేయరు. ఇలాంటివారిని ఏరేయాల్సి ఉంది. 12 మంది బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశాం” అని చంద్రబాబు తెలిపారు.
సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో 100 రోజులు పాల్గొని పాదయాత్ర చేశారని తెలిపారు. అదేవిధంగా రాజధాని రైతుల ఉద్యమంలోనూ ఆయన పొల్గొన్నారని చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టించిన వీరయ్య చౌదరి ని హత్య చేసిన విషయం తాను ఢిల్లీ పర్యటనలో ఉండగానే తెలిసిందని చెప్పారు. మంచినాయకుడిని కోల్పాయామన్న ఆవేదన బాథ తనలో ఎప్పటికీ ఉండిపోతుందన్నారు.
సమాచారం చెప్పండి!
ఈ సందర్భంగా వీరయ్య చౌదరి హంతకులను గమనించిన వారు.. ఈ విషయాలు తెలిసిన వారు.. అనుమానితుల సమాచారం గురించి చెప్పాలని చంద్రబాబు విన్నవించారు. ఈ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబరును ఆయన ఇచ్చారు. 9121104784 నెంబరు కు ఫోన్ చేసి.. లేదా వాట్సాప్లో సమాచారం ఇవ్వాలని.. ఎవరూ భయ పడాల్సిన అవసరం లేదని.. ప్రబుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates