టీడీపీ నిర్వహించ తలపెట్టిన మహానాడు ఈ దఫా పంబరేగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జగన్ ఇలాకాలో పెడుతున్న ఈ మహానాడుకు చాలా విశేషాలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు 75వ సంవత్సరం పూర్తి చేసుకోవడంతోపాటు.. ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రికార్డును సృష్టించారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న మహానాడుకు.. అతిరథులను కూడా ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.
ఎన్డీయే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలను ఈ దఫా మహానాడుకు ఆహ్వానిస్తారని సమాచారం. సాధారణంగా ఒక పార్టీ కార్యక్రమానికి ఎంత విధేయులైనా.. మిత్రపక్షాలైనా..ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించరు. కానీ…. జనసేన నిర్వహించిన ఆవిర్భావ సభకు టీడీపీ నుంచి కూడా ఒకరిద్దరు నేతలకు ఆహ్వానాలు అందాయి. చంద్రబాబు సైతం వారిని పంపించారు. అలానే .ఇప్పుడు .. బీజేపీ నుంచి మహానాడుకు కేంద్ర మంత్రులుగా ఉన్న జేపీ నడ్డా, అమిత్షాలను ఆహ్వానించనున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో పార్టీ పరంగా బీజేపీకి ఇస్తున్న మద్దతు.. సుదీర్ఘకాలం పాటు తమ బంధం అవసరం.. వంటి విషయాలపై చంద్రబాబు ఈ వేదికగా ప్రజలకు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ముఖ్యంగా వచ్చే 25 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలుతీసుకుంటారని సమాచారం. ఈ విషయంలో యువతకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే ప్రతిపాదనకు మహానాడు వేదికగా మారనుందని సీనియర్లు చెబుతున్నారు.
అదేసమయంలో మహానాడుకు ఈ దఫా పెద్ద ప్రాంగణాన్ని ఎంపిక చేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించనున్నారు. వాస్తవానికి పార్టీకి 15 లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయి. వీరిలో సగం మందినైనా తరలించినా. . జిల్లానుంచి వచ్చేవారు.. మరికొందరు ఉంటారని భావిస్తున్నారు. సుదీర్ఘరాజకయ భవితవ్యానికి సంబంధించి చంద్రబాబు పక్కా ప్రణాళికలను ఆవిష్కరించున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ మహానాడు టీడీపీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా మారనుందని అంటున్నారు.