నితీష్ లో అసహనం దేనికి సంకేతం ?

బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లో అసహనం పెరిగిపోతోంది. ఎన్డీయే కూటమి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినపుడు నితీష్ ప్రశాంతంగానే ఉండేవారు. తర్వాత్తర్వాత బహుశా టెన్షన్ పెరిగిపోయినట్లుంది. ఎన్నికల వేడి మొదలు కాకముందు ఎన్డీయే కూటమికే మళ్ళీ అధికారం ఖాయమంటూ ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. అయితే ఎన్నికల వేడి పెరిగిపోయి మొదటిదశ పోలింగ్ జరిగేనాటికి బీహార్ లో సీన్ మారిపోయిందనింపించింది.

అసలు ఎన్నికల్లో ప్రత్యర్ధే కాదని అధికార కూటమి భావించిన యూపీఏ కూటమి హెడ్, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్జేడీ చీఫ్ తేజస్వీ బాగా గట్టివాడని అందరికీ అర్ధమైపోయింది. అనుకున్నట్లే మొదటి దశలో జరిగిన పోలింగ్ అంచనాలు కూడా మారిపోయాయి. 71 స్ధానాలకు అక్టోబర్ 28వ తేదీన జరిగిన మొదటి విడత పోలింగ్ లో 30 స్ధానాల్లో యూపీఏకే అత్యధిక సీట్లు వస్తాయనే సర్వే ఫలితాలు తేల్చాయి. అలాగే ఎన్డీయే కూటమికి 19 సీట్లే అని పోస్టు పోల్ సర్వేలో బయటపడటం నితీష్ లో కలవరం పెంచేసింది.

మొదటి విడత పోలింగ్ సమయానికే పోలింగ్ ట్రెండ్స్ నితీష్ కు తెలిసిపోయిందేమో. అందుకనే తేజస్విపై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. మొదటి విడత పోలింగ్ తర్వాత నుండి తేజస్వీ, కాంగ్రెస్ అభ్యర్ధులపై మరీ రెచ్చిపోయి ఆరోపణలు చేసేస్తున్నారు. రేపు 3వ తేదీన రెండోవిడత పోలింగ్ జరగబోతోంది. పరిస్దితిని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా వెంటనే బీహార్ ఎన్నికల ప్రచారానికి దిగిపోయారు. ప్రచారం మొదలుపెట్టడమే ఆర్జేడీ చీఫ్ పై ఆరోపణలు పెంచేశారు.

ఒకవైపు మోడి మరోవైపు నితీష్ అండ్ తేజస్వీని టార్గెట్ చేసుకున్న విషయం అర్ధమైపోతోంది. నిజంగానే ఎన్డీయే కూటమి గెలుపు నల్లేరుపై బండి నడక లాంటిదే అయితే తేజస్వినో లేకపోతే కాంగ్రెస్ అభ్యర్ధులనో ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు. పైగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి గురించి రెగ్యులర్ గా ప్రస్తావిస్తున్నారు. నిజానికి లాలూ అవినీతి గురించి ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే అవినీతి ఆరోపణలపైనే ఇపుడు లాలూ జైలులో ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పదేళ్ళనుండి సిఎంగా ఉంటున్న నితీష్ కూడా పోలింగ్ ప్రచారంలో ఇంత అసహనానికి గురికావటమే ఆశ్చర్యంగా ఉంది. నితీష్, మోడి ప్రచారం చేస్తున్న పద్దతి చూస్తుంటే యూపీఏ కూటమిని ప్రత్యేకంగా తేజస్విని చాలా తక్కువగా అంచనా వేసినట్లు అర్దమైపోతోంది. 90 స్ధానాలకు జరిగే రెండో విడత పోలింగ్ లో కూడా ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యత రాకపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా ? అన్నదే నితీష్ డౌటనుమానం. చూద్దాం ఏం జరుగుతుందో .