నిజమే.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ)కి కార్యకర్తలు అంటే ప్రాణమే. విపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా… టీడీపీ వైఖరి ఇదే. సమకాలీన రాజకీయాల్లో విపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తల సేవలు అవసరమని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. అధికారంలో ఉంటే మాత్రం పార్టీ విజయానికి కష్టపడ్డ కేడర్ గురించి ఆయా పార్టీలు అంతగా ఆలోచించవు. అయితే టీడీపీ అందుకు పూర్తిగా విరుద్ధం. పార్టీ ఉనికికి కేడరే ప్రాథమిక పునాది అని భావించే టీడీపీ… ఆ దిశగానే కేడర్ సెంట్రిక్ గానే ముందుకు సాగుతుంది. ఇందుకు నిదర్శనంగా ఆ పార్టీ ఆదివారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో కడపలో జరగనున్న పార్టీ పండుగ మహానాడు తొలి ఆహ్వానాన్ని పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన తోట చంద్రయ్య కుటుంబానికి అందించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన చంద్రయ్య వైసీపీ నేతల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. చంద్రయ్యను స్థానిక వైసీపీ నేతలు పట్టపగలే గ్రామం నడిబొడ్డున గొంతు కోసి మరీ హత్య చేశారు. ఈ క్రమంలో చనిపోతున్న సమయంలోనూ చంద్రయ్య…జై చంద్రబాబు అని నినాదిస్తూ ప్రాణాలు విడిచారట. వైసీపీ అధికారంలో ఉండగా… 2022 జనవరి 13న జరిగిన ఈ ఘటన ఏపీలో పెను కలకలమే రేపింది. ఈ దారుణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా గుండ్లపాడుకు వెళ్లారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అంతటితో ఆగని చంద్రబాబు.. చంద్రయ్య అంత్యక్రియల్లో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో చంద్రయ్య పాడె కూడా చంద్రబాబు మోశారు.
కట్ చేస్తే.. ఏటా మే నెలలో జరిగే పార్టీ పండుగ మహానాడుకు సమయం దగ్గర పడింది. విపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలో ఈ వేడుకను నిర్వహించాలని టీడీపీ తీర్మానించింది. మరి ఈ ఏటి మహానాడుకు తొలి ఆహ్వానాన్ని ఎవరికి ఇవ్వాలన్న అంశంపై చర్చ జరగ్గా… పార్టీ కోసం ప్రాణాన్నే తృణప్రాయంగా వదిలేసిన తోట చంద్రయ్య కంటే మించిన వారు ఇంకెవరు ఉన్నారన్న వాదనతో ఆయన కుటుంబానికే మహానాడు తొలి ఆహ్వానాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ ఆహ్వానాన్ని పార్టీకి చెందిన ఏ స్థానిక కార్యకర్తతోనో పంపడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ససేమిరా అన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ ప్రతినిధిగా తానే స్వయంగా గుండ్లపాడు వెళ్లి మహానాడు తొలి ఆహ్వానాన్ని చంద్రయ్య కుటుంబానికి తానే అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
మాచర్ల అంటేనే… పల్నాడు మార్క్ ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన పరిస్థితి. వైసీపీకి చెందిన పిన్నెల్లి రామకృష్షారెడ్డి వరుసబెట్టి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చాలా కాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాంటి నియోజకర్గంలో చాలా కాలం తర్వాత టీడీపీ తిరిగి విజయం సాధించిందంటే అందుకు తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉండటమే కారణమన్న వాదనలు వినిపించాయి. నాడు కూడా బ్రహ్మారెడ్డి నియోజకవర్గానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో… బ్రహ్మారెడ్డి వర్గాన్ని భయకంపితులను చేసేందుకే వైసీపీ నేతలు తోట చంద్రయ్యను హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఈ ఘటనపై కేసు నమోదు అయినా ఆ తర్వాత కేసు అటకెక్కింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ చంద్రబాబు సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది.