వైసీపీ అధినేత జగన్.. అధికారంలో ఉన్నప్పుడు.. ఆయనను తీవ్రంగా విమర్శించిన వారిలో ముందున్నారు అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు..ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్. నిరంతరం.. జగన్ విధానాలపై ఆయన రచ్చబండ పేరుతో కార్యక్రమం నిర్వహించి.. ఢిల్లీ నుంచి విమర్శనాస్త్రాలు సంధించారు. కొన్నికొన్ని సందర్భాల్లో జగన్ను కూడా అనుకరించి గేలి చేసేవారు. జగన్ పాలనపై పంచ్లు విసిరేవారు. అయితే.. సొంత పార్టీ ఎంపీ అయి ఉండి.. వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్పైనా రఘురామ ఎందుకు వైరం పెట్టుకున్నారన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.
తర్వాత తర్వాత.. రఘురామను వేధించడం.. కేసులు పెట్టడం.. సీఐడీ అప్పటి చీఫ్ రఘురామను కస్టోడియల్ టార్చర్కు గురి చేయడం తెలిసిందే. ఆ తర్వాత.. వైసీపీ వర్సెస్ రఘురామల మధ్య పోరు తీవ్రస్తాయికి చేరిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్న జగన్ కు ఆ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ .. సుప్రీంకోర్టులో కేసులు వేయడం.. ఇతర త్రా అనేక కేసుల్లోనూ ఆయనను లాగడం తెలిసిందే. ఇక, రఘురామ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీకూడా పోరాడింది. ఇది అందరికీ తెలిసిందే. కానీ.. అసలు వీరిద్దరికీ.. ఎక్కడ చెడింది? వివాదం ఎలా మొదలైంది? అనేది మాత్రం ఎవరికీ తెలియదు.
తాజాగా ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజే వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం, సత్తెనపల్లి నియోజ కవర్గంలోని బలిజేపల్లిలో శనివారం సాయంత్రం ఆయన మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు కాంస్య విగ్రహం, అన్న ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్కు, తనకు మధ్య పొరపొచ్చాలు ఎప్పుడు మొదలయ్యాయో వివరించారు. కోడెల జీవించి ఉన్న సమయంలో వైసీపీ నాయకులు తరచుగా ఆయనను విమర్శించేవారని చెప్పారు. అయితే.. ఆతర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారని.. అప్పుడు కూడా వదలకుండా విమర్శించారని తెలిపారు.
ఇలా కోడెలను అనవసరంగా ఎందుకు విమర్శిస్తారని తాను ఎదురుతిరిగినట్టు తెలిపారు. కానీ, తనపై వైసీపీ నాయకులు ఎదు రు దాడి చేశారని.. చివరకు జగన్ కూడా కోడెలను చాలా చవకబారు వ్యాఖ్యలు చేశారని.. అది విని తట్టుకోలేక.. అలా మాట్లాడొ ద్దని చెప్పానన్నారు. ఇక, అక్కడ నుంచి తమ మధ్య విభేదాలు ప్రారంభమై.. నరసాపురంలో వైసీపీ నాయకులు తనపై ఆధిపత్యం చలాయించే వరకు సాగిందని.. ఇక, అక్కడ నుంచే వైసీపీకి, జగనకు, తనకు మధ్య వివాదాలు మొదలయ్యాయని తెలిపారు. చినుకు చినకు గాలివానగా మారినట్టు ఇవి ముదిరి పాకానపడ్డాయన్నారు.
తన వ్యక్తిగతం గురించి చెబుతూ.. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదన్నారు. తనే అనేక మందికి ఎమ్మెట్యే టికెట్లు ఇప్పించానని రఘురామ చెప్పుకొచ్చారు. అనూహ్యమైన పరిస్థితులు, కారణాలే తనను రాజకీయాలవైపు నడిపించాయన్నా రు. వైసీపీ ప్రభుత్వం పోవాలన్న ఉద్దేశంతో మరింత కసిగా పనిచేశానని రఘురామ చెప్పుకొచ్చారు. తనకు రాజకీయంగా శత్రువులు ఎవరూ లేరన్నారు.