రాష్ట్రంలోని 164 నియోజకవర్గాల్లో కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజల సమస్యల పై వారు ప్రస్తావించాల్సి ఉంది. కానీ, సుమారు 90 నుంచి 100 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ప్రజల సమస్యలను కూడా వారు పట్టించుకోవడం లేదు. పైగా.. సొంత పనులు చేసుకుంటున్నారన్నది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. ఈ విషయం.. తాజాగా ప్రజా ఫిర్యాదుల వరకు చేరింది. దీనిని సీఎం చంద్రబాబు పేషీ అధికారులకు టీడీపీ నాయకులు చేరవేశారు.
ఏం జరిగినా.. తమ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని.. కర్నూలు, అనంతపురం జిల్లాలు సహా.. విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా.. లేఖలు అందించారు. తమ ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడం లేదన్నది వారి వాదన. ఇది వాస్తవమే. ప్రభుత్వం కూడా.. సొంతగానే పనులు చేస్తోంది. రహదారుల నిర్మాణం నుంచి ఇతర మౌలిక సదుపాయాల కల్పన వరకు.. ప్రభుత్వం నేరుగా చూస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు కినుక వహిస్తున్నారు.
ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అయితే.. కొత్త నాయకులు విజయం దక్కించుకున్న దరిమిలా.. పాత నేతల హవానే నడుస్తోంది. వారు సమాంతరంగా అధికారాలు చలాయిస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలు వర్సెస్ సీనియర్ల మధ్య వివాదాలను రేపింది. దీంతో ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా పనులు జరగక.. ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. మరీ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం వస్తు న్న వారి సంఖ్య పెరుగుతోంది.
క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న విభేదాలు.. సీనియర్ల హవా కారణంగా.. సుమారు 80 నియోజకవర్గా లలో పరిస్థితి ఇబ్బందిగానే ఉందన్న వాదన చంద్రబాబు నుంచి కూడా వినిపించింది. ఈ పరిస్థితిని మార్చాలని కూడా ఆయన చెప్పారు. అయినా.. నాయకులు వెనక్కి తగ్గడం లేదు. పిల్లలు ఎమ్మెల్యేలు అయితే.. పెద్దలు, కోడలు ఎమ్మెల్యే అయిన చోట మామాలు.. చక్రం తిప్పుతున్నారు. పోనీ.. పనులు చేస్తే బెటరే. కానీ, చేయడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో సెగ పెరుగుతుండడం గమనార్హం.