పింక్ డైమండ్ తర్వాత గోశాలతో స్వామి రాజకీయం

తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై ధర్నాలు, నిరసనలు కూడా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనికి ప్రతిగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు కూడా స్పందించారు. అయితే, ఈ వివాదంలో ఇప్పుడు తమిళనాడుకు చెందిన సుబ్రమణ్య స్వామి కూడా జోక్యం చేసుకున్నారు.

ఫలితంగా నిప్పుకు చమురు తోడైనట్టు వివాదం మరింత పెరిగింది. తాజాగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, సుబ్రమణ్య స్వామిపై నిప్పులు చెరిగారు. “ఆయనకు ఇక్కడ ఏం పని?” అని నిలదీశారు. “ఏదైనా ప్రశ్నించాలనుకుంటే, వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపైనా ప్రశ్నించాలి,” అని అన్నారు. “పిల్ వేస్తానని బెదిరింపులకు దిగడం ఎవరికీ క్షేమం కాదు. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని తినించారు. గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దుర్మార్గుడు,” అని బీఆర్ నాయుడు మండిపడ్డారు.

“పిల్ వేస్తామంటూ మమ్మల్ని భయపెడుతున్నారా? ఆనాడు వైసీపీ హయాంలో ఎందుకు స్పందించలేదో?” అంటూ సుబ్రమణ్య స్వామిని నిలదీశారు. “గతంలో పింక్ డైమండ్ పై అనవసర రాద్ధాంతం చేశారు. గోశాల రికార్డులన్నీ హరినాథ్ రెడ్డి ఎత్తుకెళ్లారు,” అని నాయుడు ఆరోపించారు. “సుబ్రమణ్య స్వామికి గత ఐదేళ్లలో అన్యాయాలు కనిపించలేదా? వైసీపీపై పిల్ ఎందుకు వేయలేదు? టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే స్వామి నిజానిజాలు తెలుసుకోరా?” అని ప్రశ్నించారు.

ఏసీబీకి ఇస్తాం!
గోశాల ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ వేస్తామ‌ని చైర్మన్ నాయుడు ప్రకటించారు. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని తెలిపారు. వైసీపీ తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తప్పు చేసిన వారు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వైసీపీ హయాంలో గోశాలలో అవినీతిపై ఏసీబీ విచారణ జరిపిస్తామని తెలిపారు. అప్పుడు ఎవరు గోవుల విషయంలో అన్యాయంగా వ్యవహరించారో తెలుస్తుందని అన్నారు.