టీడీపీ ఎమ్మెల్యే.. మైలవరం నియోజకవర్గం శాసన సభ సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్కు.. హైడ్రా షాకిచ్చింది. ఆయన నిర్మిస్తున్న ఓ భవనాన్ని.. హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. వాస్తవానికి ఏపీకి చెందిన ఎమ్మెల్యే వసంతకు హైడ్రా షాక్ ఇవ్వడం ఏంటన్న చర్చ సహజంగానే తెరమీదికి వస్తుంది. అయితే.. ఆయన వ్యాపార వేత్త కావడంతో హైదరాబాద్ శివారులోని కొండాపూర్లోనూ.. ‘వసంత హౌస్’ పేరుతో నిర్మాణం చేస్తున్నారు.
ఈ నిర్మాణంపైస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంలో ఉందని.. దీనిలో ఎమ్మెల్యే వసంత నిర్మాణం చేస్తున్నారని హైడ్రాకు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. దీంతో శనివారం రంగంలోకి దిగిన అధికారులు.. సదరు స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన .. ఫెన్సింగ్ను తొలగించారు. షెడ్లను జేసీబీలతో తొలగించారు.
అయితే.. హైడ్రా అధికారులు సిబ్బంది చర్యలకు రంగంలోకి దిగిన సమయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. తన నియోజకవర్గం మైలవరంలో ఉన్నారు. పార్టీ నాయకులతో ఆయన చర్చిస్తున్నారు. ఈ క్రమంలో స్పాట్లో ఉన్న కొందరు బంధవులు.. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు భారీగా మోహరించి ఉండడం.. అధికారులు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆధారాలను చూపించడంతో కూల్చివేతలు నిర్విఘ్నంగా సాగాయి. వసంత ఆక్రమించి కట్టారని భావిస్తున్న ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.