ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని కొన్నాళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎవరో విపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు కావు. కాడి పట్టే.. కార్యకర్తల నుంచి మీడియా వరకు సర్కారు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అందరూ మూకుమ్మ డిగా.. ఆలయాలకు వెళ్లవద్దు.. భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.
ఇటీవల కాలంలో తిరుమలకు మంత్రులు వరుస పెట్టి వెళ్తున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సమయం పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెప్పినా.. కీలక సమయాల్లో అన్ని ఆలయాలకు కూడా.. ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అయితే.. మంత్రులు మాత్రం.. వీటిని పెడచెవిన పెడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చంద్రబాబు సహా.. మంత్రులపైనా విమర్శలు వస్తున్నాయి. తాజాగా మంత్రులు ఒకేసారి సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లారు.
ఈ నెల 30న విశాఖ జిల్లాలో ఉన్న సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే .. జరిగే ఆ కార్యక్రమానికి వారం నుంచే ఆలయంలో హడావుడి పెరుగుతుంది. భక్తుల రాక కూడా అలానే ఉంటుంది. పైగా.. అన్నిపరీక్షలు అయిపోయి.. విద్యార్తులు సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ రాక మరింత ఎక్కువగా ఉంది. అయినప్పటికీ.. ఒకేసారి బుధవారం నలుగురు మంత్రులు.. వారి పరివారం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఒకే సారి రావడం గమనార్హం.
దీంతో సాధారణ భక్తులు.. ఎండ వేడిలోనే క్యూలైన్లలో ఇరుక్కుపోయారు. పైగా.. క్యూలైన్లకు తాళాలు కూడా వేసేయడంతో బయటకు వచ్చేందుకు అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని.. మంత్రులు తరచుగా కాకుండా.. ఎప్పుడైనా అవసరం ఉంటేనే ఆలయాలకు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నారు. అయినా.. మంత్రులు మారడం లేదు. చిత్రం ఏంటంటే.. గతంలో వైసీపీ మాజీ మంత్రి రోజా వారానికి రెండు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు టీడీపీ హయాంలో ఓ మహిళా మంత్రి కూడా.. అలానే చేస్తుండడం పై విమర్శలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.