మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజ్ కసిరెడ్డి. ఇతగాడికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేసిన అధికారులు ఆశ్చర్యంతో అవాక్కు అవుతున్నారు. ఎందుకంటే.. రాజ్ కసిరెడ్డి వ్యాపార లెక్కల్లోకి వెళుతున్న కొద్దీ బయటకు వస్తున్న వివరాలే. ఎక్కడ చూసినా ఇతగాడి వ్యాపారాలే కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ జరిపే సంస్థగా అందరికి తెలిసిన ‘ఈడీ’ పేరు మీదనే ఈడీ క్రియేషన్స్ అంటూ సినిమాలు తీసిన వైనం మరింత ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు పలు సినిమాల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టటమే కాదు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సైతం సిద్ధమవుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాదు.. రియల్ ఎస్టేట్.. విద్యుత్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన రాజ్ కసిరెడ్డి.. కూతురు పేరు మీద ఇషానీ ఇన్ ఫ్రా పేరుతో మరో కంపెనీని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. వీటికి తోడు హైదరాబాద్ లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటాలు కొన్న విషయాన్ని గుర్తించారు.
ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో ఒక్కో మద్యం కేసుకు రూ.150 నుంచి రూ.450 వరకు లంచాలు తీసుకున్నారని.. అలా చెల్లించిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టినట్లుగా ఆరోపణల సంగతి తెలిసిందే. దీంతో నెలకు రూ.60 కోట్ల చొప్పున మొత్తం 4.2ఏళ్లలో రూ.3వేల కోట్ల మేర కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి లంచాల వసూళ్ల కోసం ఏడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయటమేకాదు.. ఆ మొత్తం వ్యవహారాల్ని రాజ్ కసిరెడ్డే చూసుకున్నట్లుగా చెబుతారు.
ఇలా వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని తన వద్దే ఉంచుకున్న రాజ కసిరెడ్డి.. ఆ బ్లాక్ మనీని చలామణీలోకి తెచ్చేందుకు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా సిట్ గుర్తించింది. విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా.. లైట్ తీసుకున్న వైనం ఒక ఎత్తుగా చెప్పాలి. అంతేకాదు.. ఉల్టాగా తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తారంటూ ప్రశ్నించిన వైనం మరో ఎత్తుగా చెప్పాలి. హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించటం.. దర్యాప్తునకు సహకరించకుండా పరారు కావటంతో అతడి కోసం తీవ్రంగా గాలిస్తోంది సిట్.
తాజాగా అతడికి సన్నిహితంగా ఉండేవారు.. బినామీలు.. అతడు పెట్టుబడులు పెట్టిన సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లోనూ.. ఆయా సంస్థల డైరెక్టర్ల నివాసాల్లోనూ 50 మంది పోలీసులు హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 15 చోటల ఏకకాలంలో సోదాలు చేపట్టిన వైనం సంచలనంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన తనిఖీలు అర్థరాత్రి వరకు సాగుతూనే ఉన్నాయి. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
రాజ్ కసిరెడ్డి సతీమణి దివ్యారెడ్డి డైరెక్టర్ గా ఉన్న అరెట్ ఆసుపత్రిలోనూ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాజ్ తన కుమార్తె పేరు మీద ఇషానీ ఇన్ ఫ్రా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈడీ క్రియేషన్స్ పేరుతో ఒక బినామీ సంస్థను నడుపుతున్నట్లుగా గుర్తించారు. రాజ్ తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల అతడికి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. మంచిరేవులలో కీర్తి వెస్ట్ విండ్స్ టౌన్ షిప్ లోని రాజ్ కసిరెడ్డి అత్తారింట్లోనూ తనిఖీలు చేయటానికి వెళ్లిన టీంకు ఎదురుదెబ్బ తగిలింది.కారణం.. వారు ఐదు రోజుల క్రితమే ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అక్కడి సీసీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీలకు సంబంధించి ముందస్తు సమాచారం రాజ్ కసిరెడ్డికి అందుతున్న విషయాన్ని సిట్ అధికారులు గుర్తించారు. అతడికి ఈ సమాచారాన్ని లీక్ చేస్తున్న వారెవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీ పోలీసులకు సంబంధించిన ప్రతి అంశాన్ని రాజ్ కసిరెడ్డికి ముందుగానే అందుతుండటంతో.. అతను మరింత జాగ్రత్తలు తీసుకొని తప్పించుకుంటున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.