నాట‌క‌మా? నిజ‌మేనా? .. వ‌క్ఫ్‌పై సుప్రీంకోర్టుకు వైసీపీ!

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం-25పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. అయితే.. ఈ బిల్లు.. అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌ల్లో ఆమోదం పొందింది. ఆ వెంట‌నే ఎంత మాత్రం ఆల‌స్యం చేయకుండానే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేసేశారు. దీంతో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు-25 కాస్తా.. చ‌ట్టంగా మారింది. ఇప్పుడు దీనిపైనే నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ప‌శ్చిమ బెంగాల్‌లో పోలీసుల కాల్ప‌లుకు కూడా దారితీసి.. ఇద్ద‌రు మృతి చెందారు. సుప్రీంకోర్టులోనూ ఈ ఘ‌ట‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రంలోని అనంత‌పురం, క‌ర్నూలు, గుంటూరు, విజ‌య‌వాడ త‌దిత‌ర ముస్లింలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఈ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు కొన‌సాగుతున్నాయి. దీనిపై చంద్ర‌బాబు స్పందించాల‌న్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి కీల‌క స‌మయంలో అనూహ్యంగా వైసీపీ ఈ వ‌క్ఫ్ చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తూ.. సుప్రీంకోర్టు లో కేసు వేసిందని పార్టీ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. ముస్లింల గొంతు కోసే ఈ చ‌ట్టాన్ని తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలిపింది. దీనిని తాము లోక్‌స‌భ‌లోనూ రాజ్య‌స‌భ‌లోనూ కూడా వ్య‌తిరేకించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది.

పార్టీ అధినేత జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు.. సుప్రీంకోర్టులో కేసు వేసిన‌ట్టు పేర్కొంది. మైనారిటీ స‌మాజానికి జ‌గ‌న్ ఎప్పుడూ మ‌ద్ద‌తుగా ఉంటార‌ని.. వారి హ‌క్కుల‌కు భంగం క‌లిగితే.. ఒప్పుకొనేది లేద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో తాము కూడా కేసు వేసిన‌ట్టు తెలిపింది. అయితే.. వైసీపీ విష‌యంలో వ‌క్ఫ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లోక్‌స‌భ‌లో బీజేపీకి బ‌లం ఎక్కువ‌గానే ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ వ్య‌తిరేకించార‌ని… రాజ్య‌స‌భ‌లో బీజేపీకి బ‌లం త‌క్కువ‌గా ఉండ‌డం, వైసీపీకి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ స‌మ‌ర్థించారన్న వాద‌న ఉంది. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన రాజ్య‌స‌భ‌స‌భ్యుడు ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. దీనికి అనుకూలంగా ఓటేశార‌న్న వాద‌న కూడా. ఈ క్ర‌మంలో ఇప్పుడు కూడా అలానే నాట‌కం చేస్తున్నారా? నిజంగానే న్యాయ‌పోరాటం చేస్తారా? అనేది చూడాలి.