అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఫలితాలపై చంద్రబాబు హర్షం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ కు నివాళి అర్పించిన చంద్రబాబు… అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన కింద బలహీన వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు విద్యార్థులతో చంద్రబాబు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలను విన్న చంద్రబాబు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు యువతను ఈ రీతిన ప్రయోజకులను చేస్తున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు.

2014లో తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు… బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పేరిట ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ సాయాన్ని అందుకున్న చాలా మంది విద్యార్థులు విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వారు వెళ్లిన దేశాల్లోనే ఉపాధి మార్గాలను అందుకున్నారు. లక్షల్లో వేతనాలు సంపాదిస్తూ వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులనే మార్చేశారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు సోమవారం పొన్నేకల్లు పర్యటనలో ఉన్న చంద్రబాబుతో వీడియో కాల్ లో మాట్లాడారు. వీరిలో ఓ యువకుడు ఏడాదికి రూ.60 లక్షల వేతనాన్ని సంపాదిస్తున్నానని తెలిపారు. మరో యువతి తనకు దక్కిన అవకాశం వల్ల తన కుటుంబం బాగుపడిందని, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం తన లాంటి ఎందరో యువతీయువకులకు గోడ్పాటు అందించిందని తెలిపారు. వీరి మాటలు విన్నంతనే… చంద్రబాబు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఆర్థిక స్తోమత లేని కారణంగా ఉన్నత విద్యలు అభ్యసించలేకపోతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించే ప్రతిభావంతులైన పిల్లలకు విదేశీ విద్యను అందించేందుకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని ఆయన ఆరోపించారు. దీంతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనతోె విదేశాలకు వెళ్లిన యువత.. తమను తాము బాగు చేసుకోవడమే కాకుండా కర్మ భూమిని గురించి కూడా ఆలోచించాలని సూచించారు. అంబేద్కర్ కూడా విదేశాల్లో చదువుకుని తిరిగి భారత్ కు వచ్చి జన్మభూమి ఉన్నతి కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ మాదిరే విదేశీ విద్యా దీవెనను వినియోగించుకున్న యువత కూడా తమ జన్మభూమి అభివృద్ధి పట్ల దృష్టి సారించాలని సూచించారు. ఎంత ఎదిగినా సొంత గ్రామాన్ని మరువరాదని, కలిసి పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా సాగాలని కోరారు. తన పర్యటనలో భాగంగా గ్రామంలోని ఓ మెకానిక్ షెడ్డు, చిల్లర దుకాణాలకు వెళ్లిన చంద్రబాబు… వారికి జీవనోపాధితో పాటుగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.