సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన క్షణాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవాల.. తిరుమల శ్రీ వెంక టేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె.. సంప్రదాయ డిక్లరేషన్పై సంతకం చేశారు. అనంతరం భూవరాహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తర్వాత.. కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించారు. అనంతరం గౌతమి అతిథి గృహంలో గత రాత్రి బస చేశారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు.
ఇక, మధ్యాహ్నం 12 గంటలకు తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సత్రానికి చేరుకున్న ఆమె.. మార్క్ శంకర్ పేరుతో ఒక రోజు భోజనానికి అయ్యే ఖర్చు రూ.17 లక్షలను సమర్పించి.. ఆ ఖర్చును విరాళంగా స్వామి భక్తులకు అన్న ప్రసాద రూపంలో అందించారు. అంతేకాదు.. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పాల్గొనరాదని.. జనసేన ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. అన్నా భక్తికి, ఆమె సేవకు.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రసంశలు కురిపిస్తున్నారు.