బాబు మాటనే పెడచెవిన పెడుతున్నారా..?

సుపరిపాలనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది అందె వేసిన చెయ్యి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో నిత్యం మేధోమథనం చేస్తున్న చంద్రబాబు… ప్రజలకు మంచి పాలన అందించడానికి అహరహం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తన కేబినెట్ లోని మంత్రులకు కూడా ఆయన పలు కీలక సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. మంత్రులుగా మీరెంత నిజాయితీగా ఉన్నా… మీ వద్ద పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడితే… మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని కూడా ఆయన ఎప్పటినుంచో చెబుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు తన మంత్రులకు ఇదే మాటను పదే పదే చెబుతున్నారు. అయితే చంద్రబాబు చెబుతున్నంతసేపు బుద్ధిగా తలాడిస్తున్న మంత్రులు… ఆ తర్వాత చంద్రబాబు మాటను అటకెక్కిస్తున్నారు. ఫలితంగా పలు కీలక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇటీవలే ఏపీ హోం మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ కీలక నేత వంగలపూడి అనిత వద్ద ఏళ్ల తరబడి పీఏగా కొనసాగుతున్న జగదీశ్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ అధిష్ఠానం హెచ్చరించిన తర్వాత గానీ అనిత అతడిని తన వద్ద నుంచి తప్పించలేదు. అసలు ఒకే అధికారికి ఏళ్ల తరబడి ఒకే విధులు అప్పగించరాదని కూడా చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ప్రతి రెండున్నరేళ్లకు తమ వద్ద సహాయకులుగా పనిచేసే వారిని మారుస్తూ ఉండాలని కూడా ఆయన మంత్రులకు సూచిస్తున్నారు.

ఈ దిశగా చంద్రబాబు చేసిన ఆదేశాలను అనిత పాటించలేదనే చెప్పాలి. ఫలితంగా పీఏ హోదాలో జగదీశ్ చేసిన తప్పులు ఆమెకు తలవంపులు తెచ్చాయని చెప్పక తప్పదు. తాజాగా ఇదే తరహాలో రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అనిత మాదిరే కొల్లు రవీంద్ర కూడా తన వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న రాజబాబుపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. రాజబాబును కూడా రవీంద్ర చాలా కాలంగా తన వద్ద ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయనపై ఆరోపణలు రావడంతో ఏకంగా చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనను ప్రభుత్వం రవీంద్ర ఓఎస్డీ పోస్టు నుంచి తప్పించింది.

వాస్తవానికి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో చోటు దక్కించుకున్న కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ శాఖతో పాటుగా గనుల శాఖల బాధ్యతలు కూడా దక్కాయి. ఈ క్రమంలో తన వద్ద ఓఎస్డీగా పనిచేసేందుకు అర్హతలు ఉన్న అధికారులు ఎవరన్న విషయంపై రవీంద్ర దృష్టి సారించగా… గనుల శాఖలో పనిచేసిన చాలా మంది అధికారుల పేర్లతో పాటుగా గనుల శాఖలోనే జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన రాజబాబు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. రాజబాబును ఓఎస్డీగా నియమించుకునేందుకు రవీంద్ర సిద్ధం కాగా… రాజబాబుపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన విషయాన్ని కూడా అధికారులు ఆయన చెవిన వేశారట. అయితే గనుల శాఖపై సంపూర్ణ పట్టు కలిగిన రాజబాబు అయితేనే తనకు బాగుంటుందని రవీంద్ర అభిప్రాయపడ్డారట.

ఇదే అదనుగా భావించిన రాజబాబు చక్రం తిప్పినట్లుగా సమాచారం. ఇటీవలే గనుల శాఖపై సమీక్ష సందర్భంగా రాజబాబు ట్రాక్ రికార్డును పరిశీలించిన చంద్రబాబు… ఒకింత అనుమానంతో మరింత లోతుగా చూడగా… అసలు విషయం బయటపడిందట. దీంతో నేరుగా సీఎం హోదాలో చంద్రబాబే.. రాజబాబును తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం.