రాజీ బాటలో రోజా సక్సెస్ అయ్యారా..?

ఆర్కే రోజా పేరు వింటేనే కూటమి పార్టీలు అంతెత్తున ఎగిరి పడుతున్నాయి. వైసీపీ అదికారంలో ఉండగా.. టీడీపీ, జనసేనలపై ఓ రేంజిలో విరుచుకుపడిన రోజా వీడియోలను గుర్తుకు తెచ్చుకుని కూటమి పార్టీల నేతలు కుతకుతలాడి పోతున్నారు. అలాంటి రోజా కూటమి సర్కారుతో… ప్రత్యేకించి టీడీపీతో రాజీ కుదుర్చుకున్నారని, ఇప్పటికే ఈ రాజీ కుదరిపోయిందని, ప్రస్తుతం రోజా అరెస్టు నుంచి బయటపడిపోయారని, ఎంచక్కా ఆమె అరెస్టు భయం నుంచి బయట పడి ఊపిరి పీల్చుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం నుంచి ఈ దిశగా ఓ రేంజిలో ప్రచారం జరుగుతోంది.

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా… టీడీపీతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మంచి వాగ్ధాటితో పాటు ఆయా విషయాలను క్షణాల్లో అర్థం చేసుకుని సాగే తీరుతో టీడీపీలో రోజాకు మంచి గుర్తింపే దక్కింది. 2004లో నగరి సీటు, 2009లో ఏకంగా చంద్రగిరి సీటు దక్కినా.. రోజాకు విజయం మాత్రం దరి చేరలేదు. ఈ క్రమంలో 2009 ఎన్నికల తర్వాత రోజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా.. జగన్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో వైసీపీ మాదిరిగానే రోజా కూడా అపజయం పాలయ్యారు.

కూటమి అధికారంలో రాగా.. వైసీపీ జమానాలో జరిగిన ఆడుదాం ఆంధ్రా పేరిట భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రాగా… ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రోజా అరెస్టు ఖాయమని కూడా కూటమి పార్టీల నేతలు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తాను టీడీపీలో ఉండగా… తనతో సన్నిహితంగా మెలగిన నేతల జాబితా తీసిన రోజా…రాయలసీమ జిల్లాలకు చెందిన కీలక మంత్రితో రాజీ యత్నాలు మొదలుపెట్టారట. తొలుత ఆ మంత్రి అంతగా పట్టించుకోకున్నా… రోజా పలుమార్లు అభ్యర్థించడంతో ఆయన రోజాను విజయవాడలోని తన ఇంటికి ఆహ్వానించారట. ఈ సందర్భంగా తన మనసులోని రాజీ బాటను రోజా బయటపెట్టారని సమాచారం.

రోజా సంప్రదించిన మంత్రి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నేతగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సదరు మంత్రిపై చంద్రబాబుకు అపారమైన విశ్వాసం కూడా ఉన్నాయట. ఈ క్రమంలో సదరు మంత్రి ఓకే అంటే… చంద్రబాబు ఓకే అన్నట్టేనన్న భావనతోనే రోజా తన రాజీ బాటను ఆ మంత్రి ద్వారానే నడిపించినట్లుగా తెలుస్తోంది. గతంలో దాదాపుగా పదేళ్ల పాటు టీడీపీలో కొనసాగిన ఆమె టీడీపీలోని పట్టు విడుపులను ఇప్పుడు బాగా వినియోగించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుతో పాటు లోకేశ్ లపై ఓ రేంజిలో విరుచుకుపడిన రోజాను ఎలా క్షమించేస్తారంటూ ఆ సీమ మంత్రిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.