టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కోసం ఏపీ కేబినెట్ చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నట్లే ఉంది. ఎందుకంటే.. పయ్యావుల ఎంట్రీ ఇవ్వగానే… ఏపీ కేబినెట్ తనదైన శైలి సత్తాతో దూసుకుపోతోంది. ఏపీ కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు దక్కిన పయ్యావుల తన పనితీరును ఇట్టే బయటపెట్టేశారు. కూటమి సర్కారు అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా పయ్యావులకు స్వాగతం పలికింది. అయితేనేం.. ఏడాది తిరక్కుండానే ఖజానాను చక్కబెట్టడంతో పాటుగా దేశంలోనే రాష్ట్రాన్ని టాప్ టూ స్థానంలో నిలబెట్టిన పయ్యావుల తనతో పాటు, కేబినెట్, కూటమి సర్కారు సత్తా ఏమిటో ఇట్టే చూపెట్టేశారు. వెరసి ఏడాది తిరక్కుండానే తనకు ఎదురైన ఫస్ట్ టెస్ట్ లో పయ్యావుల ఏకంగా డిస్టింక్షన్ లో పాసయ్యారు.
పార్టీ పరంగా చూస్తే టీడీపీ నుంచి పయ్యావులకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పక తప్పదు. అయితే రైట్ టైమ్ ఆయనకు అంది రాలేదనే చెప్పాలి. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా రాజకీయం చేస్తున్న పయ్యావుల… నియోజకవర్గంలో అజాతశత్రువుగా ఎదిగారు. 2004 నుంచి ఇప్పటిదాకా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తూనే వస్తున్నారు. 2004, 2009 లలో వరుసగా పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ రెండు పర్యాయాలు టీడీపీ అదికారంలోకి రాలేదు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం పయ్యావుల ఓడిపోగా.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చినా… ఎమ్మెల్యేగా పయ్యావుల ఓడటంతో మంత్రిగా ఆయన అవకాశాన్ని అందుకోలేకపోయారు.
ఇక 2019లో తిరిగి పయ్యావుల ఎమ్మెల్యేగా గెలవగా.. టీడీపీ అదికారం కోల్పోయింది. అయితే ఈ దఫా పార్టీ ఆయనకు పీఏసీ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించింది. ఈ పదవితో వైసీపీ సర్కారుకు పయ్యావుల చుక్కలు చూపారనే చెప్పాలి. వైసీపీ సర్కారు చేస్తున్న అప్పులను ఎప్పటికప్పుడు బయటపెడుతూ సాగిన పయ్యావుల… ప్రజలకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టి మరీ వైసీపీ సర్కారు చేసిన అప్పులను పయ్యావుల ఇట్టే వెలుగులోకి తీసుకుని వచ్చారు. అంతేకాకుండా వైసీపీ సర్కారు చేస్తున్న దుబారాను కూడా ఎప్పటికప్పుడు ఆయన బయటపెడుతూనే సాగారు. ఇక ఆయా పథకాల్లో జరుగుతున్న అవినీతి తంతును కూడా పయ్యావుల ఎండగట్టారు. మొత్తంగా విపక్షంలో ఉండగానే ఆర్థిక వ్యవస్థపై పయ్యావుల తనదైన శైలి పట్టు సాదించారు.
పయ్యావుల సమర్థతను గుర్తించిన టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూటమి సర్కారు అదికార పగ్గాలు చేపట్టినంతనే పయ్యావులకు ఆర్థిక మంత్రిత్వ శాఖను అప్పగించారు. పొదుపుతో పాటు అప్పు పుట్టని పరిస్థితులను పయ్యావుల చాకచక్యంగా చక్కబెట్టారు. ఏ పనికి ఎంతమేర ఖర్చు పెట్టాలి? కూటమి సర్కారు ఇచ్చిన హామీల అమలు కోసం చంద్రబాబు సూచించిన మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలి? అన్న విషయాలపై లోతుగా అధ్యయనం చేసిన పయ్యావుల అన్నింటినీ సమప్రాదాన్యంతో చక్కబెట్టారు. అదే సమయంలో వృద్ధి రేటు క్రమంగా పెరిగేలా చర్యలు చేపట్టారు. పయ్యావుల చర్యలు సఫలం కాగా… ఇటీవలే కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో వృద్ధి రేటులో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో పయ్యావుల, ఆర్థిక శాఖ అదికారుల కృషిని గుర్తించిన చంద్రబాబు.. సోమవారం పయ్యావుల బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.