ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వెళ్లి రావడాన్ని మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని గతంలో పోసాని చేసిన ప్రకటనను ఆయనే వెనక్కు తీసుకున్నట్లుగా చెప్పక తప్పదు. ఎందుకంటే… సోమవారం పోసాని తాడేపల్లి పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఇంచార్జీ హోదాలో ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి కేబిన్ లో ఆయనతో పోసాని ఏదో చర్చిస్తూ కనిపించారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆది నుంచి వైసీపీకి అనుకూలంగా సాగిన పోసాని… టీడీపీ అంటే విద్వేషంతోనే సాగారని చెప్పాలి. జగన్ పాదయాత్రలోనూ కనిపించిన పోసాని… 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేశారు. పలువురు సినిమా నటులను వైసీపీకి దగ్గర చేయడంలోనూ ఆయన కీలక భూమిక పోషించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడంతో పోసానికి కూడా పదవి దక్కింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కొంతకాలం పాటు పనిచేశారు. ఈ క్రమంలో పలుమార్లు మీడియా ముందుకు వచ్చిన ఆయన టీడీపీపైనా, ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపైనా, మంత్రి లోకేశ్ పైనా పోసాని నిప్పులు చెరిగారు. అసభ్య పదజాలంతో దూషించారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ బాగానే ఉన్నా.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడంతోనే పోసానికి కష్ట కాలం మొదలైంది. అయితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పోసాని… తాను చేసింది తప్పేనని, ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనని, బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని వేడుకున్నారు. చంద్రబాబు, పవన్ లు పెద్దగా పట్టించుకోకున్నా… ఆయన గత విన్యాసాలను టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం క్షమించలేదు. తమ నేతలను పోసాని దూషించారంటూ ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో గత నెలలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. ఆయా కేసుల విచారణ నిమిత్తం పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.
ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పోసాని కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి బెయిల్ ఇప్పించేందుకు ఏకంగా మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందాన్ని రంగంలోకి దింపారు. అయినా కూడా పని కాకపోవడంతో జడ్జి ముందు పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా వైసీపీ లాయర్లే పోసానికి బెయిల్ ఇప్పించగా.. చాలా రోజుల జైలు జీవితం తర్వాత పోసాని బయటకు వచ్చారు. ఆ తర్వాత వారంలో రెండు రోజులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చిపోతున్నారు. మరి ఎంతైనా అరెస్టైన తనకు వైసీపీ అండగా నిలిచిందని అనుకున్నారో, లేదంటే బెయిల్ ఇప్పించిందని భావించారో తెలియదు గానీ… రాజకీయాలను వదిలేశానని చెప్పిన పోసాని.. ఆ మాటను పక్కనపెట్టేసి నేరుగా వైసీపీ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యారు.