క‌ర్నూలుపై బీజేపీ స్పెష‌ల్‌ ఇంట్ర‌స్ట్.. వ్యూహం ఇదే!

రాష్ట్రంలో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా కేంద్రంలోని పెద్ద‌లే రాష్ట్రంలో రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ చూపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా త‌మ‌కు అనుకూలంగా ఉన్న జిల్లాల‌పై బీజేపీ పెద్ద‌లు ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా క‌ర్నూలు విష‌యంలో ఢిల్లీ పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నార‌ని తెలిసింది. ఇక్క‌డ ఎద‌గ‌డం ద్వారా .. సీమ‌లో బీజేపీకి ఉన్న కొద్దొ గొప్పో ఓటు బ్యాంకును బ‌లోపేతం చేసుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

సీమ విష‌యానికి వ‌స్తే.. క‌డ‌ప‌లో కీల‌క నేత‌లు బీజేపీకి ఉన్నారు. సీఎం ర‌మేష్‌, మాజీ మంత్రి ఆదినారాయ ‌ణ రెడ్డి.. వంటివారు బీజేపీకి అందివ‌స్తున్న నాయ‌కులుగా లెక్క‌లు వేసుకుంటున్నారు. చిత్తూరులో భానుప్ర‌కాశ్‌రెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌లు ఉన్నారు. క‌ర్నూలు విష‌యానికివ‌స్తే.. ఎంపీ టీజీ వెంక‌టేష్ వంటి నాయకులు ఉన్న‌ప్ప‌టికీ.. ఆశించిన రీతిలో ఇక్క‌డ బీజేపీ ఎదగ‌లేక పోతోంది. పైగా ఇక్క‌డ న్యాయ రాజ‌ధాని ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగానే ఉంది. రాష్ట్ర స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి ఈ విష‌యంలో బీజేపీ పెద్ద‌లు సై అన్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ ఎదిగే అవ‌కాశాల‌ను పార్టీ పెద్ద‌లు ప‌రిశీలిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి కుటుంబంతో స‌హా.. మాజీ ఎంపీ బుట్టారేణుక కుటుంబాల‌ను కూడా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇరు కుటుంబాలు కూడా రాజ‌కీయంగా ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. కోట్ల ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు. రేణుక కుటుంబం వైసీపీలో ఉంది. అయితే, పార్టీల్లో వారికి గ‌తంలో ఉన్న గుర్తింపు లేదు. దీంతో ఇరు కుటుంబాలు గుర్తింపు కోసం త‌హ‌త‌హ లాడుతున్నాయి. కానీ, ఇప్ప‌ట్లో ప‌ద‌వులు ద‌క్కే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు ఈ గ్యాప్‌ను బీజేపీ వినియోగించుకుని, వారిని పార్టీలో చేర్చుకునేలా పావులు క‌దుపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.