హైపర్ మార్కెట్లు, మాల్స్, మల్టీప్లెక్స్ ల నిర్మాణం, నిర్వహణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఏపీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చింది. ఏపీ వాణిజ్య రాజధాని విశాఖలో ఆ సంస్థ ఓ మాల్ సహా కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖలో ఈ కంపెనీ దాదాపుగా రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఇలాంటి తరుణంలో ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించారు. వీరికి సహకారం అందించిన సీఆర్డీఏ అధికారులు.. అమరావతిలోని పలు ప్రాంతాలను దగ్గరుండి మరీ చూపించారు. ఈ పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇప్పటికే విశాఖలో మాల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా సమాచారం. విశాఖలో పెట్టుబడుల కోసం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో లులూ గ్రూప్ సంస్థ అధినేత యూసుఫ్ అలీ… అమరావతి గురించి కూడా వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతి ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు చెప్పడంతో అక్కడ కూడా పెట్టుబడులు పెట్టేందుకు అలీ ఆసక్తి చూపారట. ఈ క్రమంలోనే ఓ సారి అమరావతిలో పర్యటించి అక్కడి స్థలాలు, వాతావరణం తదితరాలను పరిశీలించాలని చంద్రబాబు కోరారట. ఈ కారణంగానే లులూ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం అమరావతిలో పర్యటించినట్లు సమాచారం.
అమరావతిలో పర్యటన సందర్భంగా భవిష్యత్తులో నగరం ఎలా ఉండబోతోంది?. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రానున్నాయి? నవ నగరాల రూపు రేఖలు ఎలా ఉంటాయి? జనాభా ఏ మేర పెరుగుతుంది? తదితర వివరాలను సీఆర్డీఏ అధికారుల ద్వారా తెలుసుకున్న లులూ బృందం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందట. విశాఖలో మాదిరిగానే అమరావతిలోనూ ఓ హైపర్ మాల్, కన్వెన్షన్ సెంటర్, మల్టీప్లెక్స్, ఐమ్యాక్స్ తదితరాలను ఓ సమూహంగా ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఇందుకోసం విశాఖలో మాదిరిగానే అమరావతిలోనూ ఆ సంస్థ రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒప్పందం కుదిరే అకాశాలున్నట్లు సమాచారం.