హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూముల విషయంపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా సీరియస్గానే స్పందించింది. ఈ భూముల్లో చెట్ల నరికి వేతను ఆపివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. అదేసమయంలో అన్ని పక్షాల వాదనలు వింటామని పేర్కొంది. ఇదిలావుంటే.. అసలు ఈ భూముల విషయం ఎందుకు వివాదంగా మారిందన్నది ప్రశ్న.
విద్యాసంస్థలకు .. గతంలో కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే.. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000లలో ఒక చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారమే.. నిరుపయోగంగా ఉన్న హెచ్సీయూ భూములు 400 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఉమ్మడి ఏపీలోని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే.. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని నిలువరించి.. గోడ నిర్మాణం చేసింది. ఇక, బీఆర్ ఎస్ హయాంలోనూ ఈ విషయం పెద్దగా వివాదం కాలేదు.
వాస్తవానికి బీఆర్ ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు విక్రయించి.. సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించారు. కోకా పేట భూములు ఈ కోవలేవే. అయితే.. హెచ్సీయూ భూముల విషయంలో మాత్రం బీఆర్ ఎస్ జోక్యం చేసుకోలేదు. విద్యార్థుల భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో ఈ భూముల విక్రయానికి కానీ.. స్వాధీనానికి కానీ ప్రయత్నం చేయలేదు. కానీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ భూములను స్వాధీనం చేసుకుని.. లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నది చర్చ.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడం.. సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేకపోవడం కారణంగా.. ఈ వాదనకు బలం చేకూరుతోంది. అలాగని ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు.. విద్యార్థి సంఘాలు మాత్రం తమ నిరసనను కొనసాగిస్తున్నాయి. తీరా ఇది హైకోర్టుకు.. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా చేరడంతో ప్రస్తుతానికి వివాదం సర్దుమణిగినా.. మున్ముందు ఏం జరుగుతుందన్నది మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏదేమైనా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం చేయాలనుకున్నది చేసే తీరుతుందని మంత్రులు చెప్పడం గమనార్హం.