తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు తమవేనని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వాదిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటామంటూ ఏకంగా ఆ భూముల చదునుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు, కొన్ని ప్రజా సంఘాలతో పాటుగా విపక్షాలు వాదిస్తున్నాయి. చిక్కటి అడవితో అరుదైన జంతుజాలంతో పర్యావరణానికి నెలవుగా అలరారుతున్న ఈ భూములను వదిలేయాలని ఆ యా సంఘాలు కోరుతున్నాయి. అయితే ఈ వినతులను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం మొండిగానే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది.
ఈ భూముల వ్యవహారంపై బుధవారం దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు… తన విచారణ పూర్తి అయ్యేదాకా భూముల చదునును నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం హైకోర్టు విచారణ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో కొందరు న్యాయవాదులు నేరుగా గురువారం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వర్పిటీ భూములను కాపాడాలంటూ వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు… కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తన విచారణ పూర్తి అయ్యేదాకా చెట్లు నరికే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే… న్యాయవాదుల పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆలోగా సెంట్రల్ వర్సిటీ భూముల వద్దకు వెళ్లి.. అక్కడి తాజా పరిస్థితులను వివరిస్తూ ఓ మధ్యంతర నివేదికను సమర్పించాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక తాను విచారణ ప్రారంభించే సమయానికి తనకు చేరాలని కూడా రిజిస్ట్రార్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తానేమీ హైకోర్టు చేపట్టిన విచారణపై తానేమీ స్టే ఇవ్వడం లేదని… ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణను మొదలుపెట్టిన హైకోర్టు తన విచారణను కొనసాగించవచ్చని కూడా సుప్రీం తెలిపింది. అంటే… ఓ వైపు హైకోర్టు విచారణ ముగిసి తుది తీర్పు వెలువడే సమయానికి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమవుతుందన్న మాట. ఈ నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం మరింత జఠిలంగా మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.