“కొందరు చెబుతారు.. మాట ఇచ్చాను.. అన్నీ చేసేస్తామని.. కానీ, వాళ్లు ఏం చేశారో.. అందరికీ తెలుసు. మడమా.. కాలు అన్నీ తిప్పేశారు. కానీ.. నేను డైలాగులు చెప్పే రకం కాదు.. చేసేది చెబుతాను.. చెప్పింది చేస్తాను. వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి నేను రాలేదు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు వచ్చాను” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై సెటైర్లు సంధించారు.
పీపుల్ ఫస్ట్ నినాదంతో తాము ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. “అభివృద్ది-సంక్షేమం.. రెండూ మాకు ముఖ్యమే. ప్రజలకు సంక్షేమం ఇవ్వడంతోపాటు.. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. కొంతమేరకు సఫలం అయ్యాం. ఇంకా చేయాల్సి ఉంది చాలా ఉంది. అయినా.. ఎక్కడా విశ్రమించడం లేదు. పనిచేస్తేనే ఫలితం వస్తుంది.” అని తేల్చి చెప్పారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
దివ్యాంగురైనా సుభాషిణికి రూ.15 వేల పింఛనును అందించారు. అనంతరం.. స్థానికంగా గొల్లపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలకు చురకలు అంటించారు. “గత పాలకులు చేసిన ధ్వంసాన్ని సరిదిద్ది.. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పా. ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నా” అని తెలిపారు. రాష్ట్రంలో కోటిన్నర కుటుంబాలు ఉన్నాయని.. వీరిలో 64 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
“ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ(అంటే..జగన్ ఇచ్చిన అన్ని పథకాలు కలిపి) నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు 2,722 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అలా కాకుండా.. మూడు నెలల వరకు ఎప్పుడైనా పింఛను తీసుకునే అవకాశం కల్పించాం. మేం డైలాగులు చెప్పం.. చేసి చూపిస్తాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఈ క్రమంలోనే పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని వ్యాఖ్యానించారు.